AK 47లతో స్కూల్లో దుండగుల కాల్పులు..400లమంది విద్యార్దులు కిడ్నాప్..!

  • Published By: nagamani ,Published On : December 14, 2020 / 10:11 AM IST
AK 47లతో స్కూల్లో దుండగుల కాల్పులు..400లమంది విద్యార్దులు కిడ్నాప్..!

Nigeria : 400 students missing after gunmen attack a school : నైజీరియాలోని ఓ గవర్నమెంట్ స్కూల్లో మారణాయుధాలతో చొరబడిన దుండగులు వందలమంది విద్యార్దులను అపహరించుకుని పోయారు. ఈ ఘటనతో విద్యార్ధుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమ బిడ్డల ప్రాణాల గురించి తల్లడిల్లిపోతున్నారు. శుక్రవారం (డిసెంబర్ 11,2020)న జరిగిన ఘటనపై విద్యార్ధుల ఆచూకీ ఇంతవరకూ లభించకపోవటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే..నైజీరియాలోని కట్సీనా రాష్ట్రంలో సాయుధ దుండగులు శుక్రవారం ఒక స్కూల్ పై దాడి చేశారు. ఏకే 47 రైఫిల్స్‌తో స్కూల్లోకి చొరబడి కాల్పులు జరిపారు. ఈ దాడి తరువాత దాదాపు 400లమంది విద్యార్ధులు కనిపించకుండాపోయారు. దుండగులే వారిని కిడ్నాప్ చేశారని పోలీసులుతెలిపారు.

దాడి అనంతరం పెద్ద సంఖ్యలో విద్యార్థులు కనిపించకుండాపోయారని..ఆయుధాలతో స్కూల్ పై దాడికి పాల్పడిన దండుగులు విద్యార్థులను బందీలుగా తీసుకువెళ్లారని స్థానికులు తెలిపారు.కాగా ఆ స్కూల్‌లో 600 మంది విద్యార్థులు ఉండగా..వారిలో 400 మంది ఆచూకీ తెలియకుండాపోయింది. దీనిపై పోలీసులు పలు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నా వారి జాడ ఇప్పటి వరకూ తెలియరాలేదు.

మాయం అయిన విద్యార్ధుల ఆచూకీ గురించి తీవ్రంగా గాలిస్తున్నామని పోలీస్ అధికార ప్రతినిధి గాంబో ఇషా తెలిపారు. పోలీసులు, నైజీరియా సైన్యం, దేశ వైమానిక దళం విద్యార్థుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. కాగా స్కూల్ పై దుండగులు దాడికి దిగి కాల్పులు జరపటంతో భయపడిపోయిన చాలామంది విద్యార్ధులు స్కూల్ నుంచి పారిపోయి సమీపంలో ఉన్న ఓ అడవిలో తలదాచుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు.