క్లాసులకు హాజరవ్వాలంటే 3సార్లు కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందే, విద్యార్థులకు కొత్త రూల్

  • Published By: naveen ,Published On : August 2, 2020 / 01:50 PM IST
క్లాసులకు హాజరవ్వాలంటే 3సార్లు కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందే, విద్యార్థులకు కొత్త రూల్

కరోనా నేపథ్యంలో అమెరికాలోని ఓ యూనివర్సిటీ కొత్త రూల్ తీసుకొచ్చింది. క్లాసులకు అటెండ్ కావాలంటే ప్రతి స్టూడెంట్ మూడు సార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పింది. ఈ మేరకు నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది.

ఏ విధంగా టెస్టులు చేస్తారు:
క్యాంపస్ కి చేరుకున్న వెంటనే విద్యార్థులు కరోనా టెస్ట్ చేయించుకోవాలి. మూడు రోజుల తర్వాత మరోసారి టెస్ట్ చేస్తారు. దాని తర్వాత రెండు రోజుల అనంతరం మరోసారి కరోనా నిర్ధారణ టెస్టు చేస్తారు. ఫస్ట్ రిపోర్టు ఫలితం వచ్చే వరకు విద్యార్థులంతా తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాలి. మూడో రిపోర్టు ఫలితం వచ్చే వరకు వారిని క్లాస్ రూమ్స్ లోకి అనుమతించరు. ఆన్ క్యాంపస్ లోని క్లాసులకు అటెండ్ అయ్యే విద్యార్థులందరికి ఈ రూల్ వర్తిస్తుంది. నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు రెండు చాయిస్ లు ఇచ్చింది. వ్యక్తిగతంగా క్లాసులకు హాజరు కావొచ్చు లేదా ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అవ్వొచ్చు. వ్యక్తిగతంగా క్లాసులకు అటెండ్ కావాలని అనుకునే వారు తప్పనిసరిగా మూడు సార్లు కరోనా నిర్ధారణ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. రిపోర్టులో నెగిటివ్ అని వస్తేనే విద్యార్థులను క్లాస్ రూమ్ లోకి అనుమతిస్తారు.

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈస్ట్రన్ వర్సిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్టులు చేశాక రిపోర్టులో పాజిటివ్ అని వస్తే ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదని వారి అభిప్రాయం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి తాము సిద్ధంగా లేమని వర్సిటీ యాజమాన్యం తెలిపింది. సిబ్బంది, విద్యార్థుల సేఫ్టీ కోసం తాము ఈ పని చేస్తున్నామని వివరించింది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ఒకరిని చూసి ఒకరు భయపడుతున్నారు. ఎదుటి వారికి కరోనా ఉందేమో అనే అనుమానంతో భయం భయంగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎవరికీ ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా, భయాలు లేకుండా ఉండేందుకు విద్యార్థులకు కరోనా టెస్టులు చేయాలని వర్సిటీ నిర్ణయం తీసుకుంది.

విద్యా సంస్థలు ఎప్పుడు తెరుస్తారో?
క‌రోనా విజృంభ‌ణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్థ‌ల‌న్నీ 2020 మార్చిలో మూత‌పడిన సంగతి తెలిసిందే. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సీటీలు అన్నీ బంద్ అయ్యాయి. విద్యా సంస్థలను తిరిగి ఎప్పుడు తెరుస్తారో క్లారిటీ లేదు. దీనిపై ప్ర‌భుత్వాలు త‌ర్జ‌నభ‌ర్జ‌న ప‌డుతూనే ఉన్నాయి. రోజురోజుకి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు ఎప్పుడు తెరుస్తారన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కరోనా తగ్గే వరకు ఇలా మూసి ఉంచుతారా? లేదంటే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ స్కూళ్లకు అనుమతులిస్తారా? అని ఎంతో మంది ఎదురుచూస్తున్నారు.

తొందరపడితే రిస్కే:
విద్యా సంస్థల విషయంలో తొందరపాటు పనికి రాదని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఏ మాత్రం రిస్క్ తీసుకున్నా పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడేసినట్టు అవుతుంది. అందుకే విద్యా సంస్థల రీఓపెన్ విషయంలో ఆచితూచి అడుగువేస్తున్నాయి. చాలా సంస్థలు ఇప్పటికే ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ప్రభుత్వాలు టీవీ చానెల్స్ ను వాడుకుంటున్నాయి. ప్రభుత్వానికి చెందిన చానెల్స్ లో పాఠ్యాంశాలకు సంబంధించిన వీడియోలు ప్రసారం చేస్తున్నాయి.