Nobel Prize In Literature : సాహిత్యంలో అబ్దుల్రజాక్ గుర్నాకు నోబెల్
ప్రముఖ నవలా రచయిత అబ్దుల్రజాక్ గుర్నాను .. సాహిత్యం విభాగంలో ఈ ఏడాది నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ గురువారం ప్రకటించింది.
Nobel Prize In Literature ప్రముఖ నవలా రచయిత అబ్దుల్రజాక్ గుర్నాను .. సాహిత్యం విభాగంలో ఈ ఏడాది నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ గురువారం ప్రకటించింది. స్వతహాగా శరణార్థి అయిన రజాక్.. వలసవాదం వెతలు, శరణార్థుల జీవితాలను ప్రతిబింబించేలానే రచనలు చేశారు. శరణార్థి అంతరాయం థీమ్ ఆయన రచనల్లో కనిపిస్తుంది.
వలసవాదం ప్రభావాలను, గల్ఫ్లో విభిన్న సంస్కృతులు మరియు ఖండాల మధ్య ఉన్నమధ్య నలిగిన శరణార్థుల దీనావస్థలను అబ్దుల్ రజాక్ తన రచనాశైలిలో సుస్పష్టంగా వ్యక్తం చేసినందుకుగాను ఆయనను నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు ఇవాళ స్వీడిష్ అకాడమీ తన ప్రకటనలో తెలిపింది. కాగా,నోబెల్ బహుమతి కింద గుర్నాకు బంగారు పతకం, 11 లక్షల డాలర్ల నగదు బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ అందజేయనుంది.
టాంజానియాలోని జాంజిబార్ ద్వీపంలో 1948లో జన్మించిన అబ్దుల్రజాక్ గుర్నా..1960 ల చివరలో ఇంగ్లాండ్ కు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. గుర్నా ఆంగ్ల భాషలో తన 21 ఏళ్ల వయస్సులో రాయడం ప్రారంభించారు. స్వాహిలి ఆయన మాతృ భాష అయినప్పటికీ, ఇంగ్లీష్ ఆయన సాహిత్య సాధనంగా మారింది. ఇంగ్లాండ్ లోని కెంట్ యూనివర్శిటీలో ప్రొఫెసర్గా పనిచేసిన ఆయన ఇటీవలే పదవీ విరమణ చేశారు.
ఇప్పటివరకు 10 నవలలు సహా ఎన్నో చిన్న చిన్న కథలు గుర్నా రచించారు. ఆయన రాసిన ‘ప్యారడైజ్’ అనే నవల 1994 మ్యాన్ బుకర్ ప్రైజ్కు షార్ట్ లిస్ట్ అయింది. ఇది ఆయన రాసిన నాలుగవ నవల. ఆ నవలతో ఆయన పాపులర్ రైటర్గా మారారు. 1990లో ఈస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన ఆయన ఆ నవలలో ఆ ట్రిప్ గురించి రాశారు. భిన్నమైన విశ్వాసం కలిగిన వ్యక్తుల ఓ విషాద ప్రేమకథను చెప్పారు. శరణార్థి అనుభవాలను తన నవల్లో గుర్నా అద్భుతంగా ఆవిష్కరించారు. ఐడెంటీ, సెల్ఫ్ ఇమేజ్పైనే ఆయన తన కథలతో దృష్టి పెట్టారు. అభద్రతాభావంలో ఉన్నవారి జీవితాలు ఎలా ఉంటాయో ఆయన తన రచనా శైలితో ప్రస్పుటం చేశారు.
కాగా, సాహిత్య విభాగంలో భారత దేశానికి చెందిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్కు 1913లో నోబెల్ బహుమతి దక్కిన విషయం తెలిసిందే. ఆయన రచించిన గీతాంజలి కావ్యానికి ఈ పురస్కారం వరించింది. నోబెల్ సాహిత్య అవార్డు పొందిన తొలి ఆసియా వాసి కూడా ఠాగూర్. మరోవైపు,2018లో సాహిత్య నోబెల్పై ఊహించని రీతిలో మచ్చ పడింది. విజేతను నిర్ణయించే స్వీడిష్ కమిటీలో లైంగిక వేధింపుల వార్తలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఆ ఏడాది పురస్కారాన్ని వాయిదా వేశారు. 2018తో పాటు 2019ని కలిపి ఒకేసారి ఇచ్చారు.
ఇక, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, శాంతి, అర్థశాస్త్రాలు వంటి ఆరు విభాగాల్లో అందించే నోబెల్ పురస్కారాల్లో ఇది నాల్గవది. సొమవారం మెడిసిన్ లో నోబెల్ బహుమతిని ప్రకటించగా.. అమెరికా సైంటిస్టులు డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటపౌటియన్లు ఈ బహుమతి దక్కింది. ఇక,2021 ఏడాదికిగాను ఫిజిక్స్(భౌతిక శాస్త్రం)విభాగంలో…జపాన్,జర్మనీ,ఇటలీకి చెందిన సైంటిస్టులు సుకురో మనాబో(90), క్లాస్ హాసిల్మన్(89), జార్జియో పారిసీ(73)ని ఈ ఏడాది నోబెల్ బహుమతి వరించింది. 2021 ఏడాదికిగాను రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది. జర్మనీకి చెందిన బెంజమిన్ లిస్ట్,యూకేకి చెందిన డేవిడ్ డబ్ల్యూసీ మెక్మిలన్ లను కెమిస్ట్రీలో విభాగంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి దక్కింది.
ALSO READ గుడ్డునుంచి పుట్టగానే ఆకాశంలోకి దూసుకుపోయే పక్షి..228 మిలియన్ ఏళ్లనాటి ఈ భారీ జీవి విశేషాలు..