AQ Khan : పాక్ అణుశాస్త్ర పితామహుడు కన్నుమూత
పాకిస్తాన్ అణు కార్యక్రమ పితామహుడిగా పేరుపొందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ ఖదీర్ఖాన్(85) ఆదివారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న
AQ Khan పాకిస్తాన్ అణు కార్యక్రమ పితామహుడిగా పేరుపొందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ ఖదీర్ఖాన్(85) ఆదివారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అబ్దుల్ ఖదీర్ను ఆదివారం ఉదయం ఇస్లామాబాద్లోని హాస్పిటల్ లో చేర్చారు. అయితే ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో ఖదీర్ మృతి చెందారు. ఊపిరితిత్తులు పనిచేయకపోవడం వల్లే అబ్దుల్ ఖాదిర్ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
ఖదీర్ మృతిని పాకిస్తాన్ హోం మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ మృతి చాలా బాధించిందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. దేశమంతా ఆయనను ఎంతగానో ప్రేమిస్తుంది.. జాతి భద్రత కోసం ఆయన అణ్వాయుధాలను ఇచ్చారు.. పాక్ పౌరుల హీరో ఆయన అని ఇమ్రాన్ ఖాన్ కొనియాడారు. అటు పాక్ రక్షణ మంత్రి పర్వేజ్ ఖాతక్ కూడా ఖదీర్ మృతికి సంతాపం ప్రకటించారు.
డాక్టర్ అబ్దుల్ ఖదీర్ఖాన్ 1936 లో భారతదేశంలోని భోపాల్ నగరంలో జన్మించారు. కానీ విభజన తర్వాత.. ఖదీర్ఖాన్ తన కుటుంబంతో పాకిస్తాన్ వెళ్లారు. కరాచీలోని డీజే సైన్స్ కాలేజీలో ప్రాధమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత 1961లో ఉన్నత చదువుల కోసం యూరప్ వెళ్లి, జర్మనీ, హాలండ్లోని విశ్వవిద్యాలయాల నుండి పీహెచ్డీ చేశారు.
డాక్టర్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్ మే 1998లో పాకిస్తాన్ మొదటి అణు పరీక్ష నిర్వహించినప్పుడు పాకిస్తాన్లో రాత్రికిరాత్రే జాతీయ హీరో అయ్యారు. అణు పరీక్షల తరువాత, పాకిస్తాన్ ముస్లిం ప్రపంచంలో ఏకైక అణుశక్తిగా, అణ్వాయుధాలను కలిగి ఉన్న ఏడవ దేశంగా మారింది. పాకిస్తాన్ను ముస్లిం ప్రపంచంలో మొదటి అణ్వాయుధ సంపన్న దేశంగా తీర్చిదిద్దిన ఆయనకు పాకిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చి సత్కరించింది.
అయితే 70 దశకంలో ఆయన నెదర్లాండ్స్ నుంచి పాకిస్తాన్కు తిరిగిరావడానికి ముందే ఆయన వివాదంలో చిక్కుకున్నారు. నెదర్లాండ్స్లోని న్యూక్లియర్ రీసెర్చ్ ఫెసిలిటీలో ఖదీర్ పనిచేసారు. రీసెర్చ్ ఫెసిలిటీ నుంచి యురేనియం ఎన్రిచ్మెంట్ టెక్నాలజీని తస్కరించారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. పాకిస్తాన్ తొలి న్యూక్లియర్ వెపన్ అభివృద్ధిలో ఆ టెక్నాలజీని ఆయన ఉపయోగించారని చెబుతుంటారు.
1990లో పాక్ అణ్వస్త్ర కార్యక్రమాలపై ఆంక్షలు విధించిన అమెరికా.. ఖదీర్పై ఆరోపణలు సైతం చేసింది. అణురహస్యాల విషయంలో పొరుగున ఉన్న ఇరాన్, నార్త్ కొరియాతో ఖదీర్ వ్యాపారం చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించింది.