ట్రంప్ కి లాడెన్ మేనకోడలు మద్దతు…అయన మాత్రమే మరో 9/11 జరగకుండా ఆపగలడు
నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోతే…అమెరికాపై మరో 9/11 తరహా ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఒసామా బిన్ లాడెన్ మేనకోడలు.. నూర్ బిన్ లాడిన్ తెలిపింది. డోనాల్డ్ ట్రంప్ మళ్లీ గెలిస్తేనే… అమెరికాపై అలాంటి ఉగ్రదాడులను జరగకుండా అతను ఆపగలడని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది.
అమెరికాను రక్షిస్తానన్న విషయాన్ని ఇప్పటికే ట్రంప్ నిరూపించారని, ఉగ్రవాదుల్ని సమూలంగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపింది. ట్రంప్ పట్టుదలను చూశానని, ఆయన్ను మళ్లీ ఎన్నుకోవాలని, ఇది అమెరికా భవిష్యత్తుకే కాదు, పాశ్చాత్య నాగరికతకు కూడా మంచిదే అన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. 2015లో అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ పేరుగా ప్రకటించగానే తాను ఆయనకు మద్దతుగా నిలిచిన విషయాన్ని నూర్ గుర్తు చేశారు.
అమెరికాలో వామపక్షవాదులు.. రాడికల్స్తో జతకట్టినట్లు ఆమె ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా, ఉపాధ్యక్షుడిగా బైడెన్ పరిపాలిస్తున్న సమయంలో.. ఇస్లామిక్ తీవ్రదానికి చెందిన ఐసిస్ పుంజుకున్నట్లు ఆమె చెప్పింది. దాంతోనే ఆ ఉగ్రవాదులంతా యూరో ప్లో తిష్టవేసినట్లు ఆమె వెల్లడించింది.
వాస్తవానికి ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అణిచివేస్తానని చెప్పి.. డోనాల్డ్ ట్రంప్ గత ఎన్నికల్లో అధ్యక పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయితే ఇప్పుడు రెండవ సారి ఆయన అధ్యక్ష బరిలో ఉన్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో డోనాల్డ్ వ్యూహాలు ఫలించి మరోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటారా.. లేక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అగ్రరాజ్య అధ్యక్ష పీఠాన్ని దక్కించుకుంటారా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.