మాట మార్చిన పాక్..భారత యాత్రికులు డబ్బులివ్వాల్సిందే
కర్తార్ పూర్ కారిడార్ మీదుగా పాక్ లోకి ప్రవేశించే యాత్రికులకు తొలిరోజు ఎలాంటి పీజు వసూలు చేయమని నవంబర్ 1వ తేదీన పాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పాక్ ఇప్పుడు మాట మార్చింది .కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవం రోజున ఒక్కొక్కరికి 20 డాలర్ల చొప్పున ప్రవేశ రుసుం వసూలు చేస్తామని పాక్ స్పష్టం చేసింది. శనివారం(నవంబర్-9,2019)గురు నానక్ 550వ జయంతి సందర్భంగా గురుదాస్ పూర్ లో కర్తార్పూర్ కారిడార్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి భారత్ నుంచి 550 మంది ప్రముఖులు హాజరు కానున్నారు. సిక్కుల మత గురువు గురు నానక్కు చెందిన గురుద్వారా దర్బార్ సాహిబా ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్నది. అయితే ప్రతి రోజూ 5 వేల మంది సిక్కులు ఆ గురుద్వార్ వెళ్లేందుకు పాక్ అనుమతి ఇచ్చింది. గురు నానక్ తన చివరి 18 ఏళ్ల జీవితాన్ని గురుద్వారా దర్బార్ సాహిబ్లోనే గడిపారు. పాక్ లోని పంజాబ్ ప్రావిన్సులోని నరోవల్ జిల్లాలో ఈ గురుద్వారా ఉన్నది. అంతర్జాతీయ సరిహద్దుకు ఇది కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.
కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. పోలీసులు అలర్ట్ గా ఉన్నారని,అన్ని సవాళ్ల పట్ల అవగాహన కలిగి ఉన్నట్లు పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా తెలిపారు.