కరోనా గురించి మాట్లాడుకుంటూ విమానం కూల్చేసిన పైలట్లు
మే-22న కరాచీ ఎయిర్ పోర్ట్ కు సమీపంలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పీఐఏ)కు చెందిన ఎ320 విమానం ఇళ్ళపై కుప్పకూలిన ఘటనలో ఎటువంటి సాంకేతిక లోపం చోటుచేసుకోలేదని తేలింది.
కరోనా వైరస్ గురించి చర్చల్లో మునిగి పైలట్, కో- పైలట్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లే విమాన కూలిపోయి 97 మంది ప్రాణాలు కోల్పోయారని పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్ ఖాన్ తెలిపారు. అదే విధంగా.. పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారుల సూచనలు పట్టించుకోలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.
ల్యాండింగ్ విషయంలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. ‘నేను చూసుకుంటానులే’ అని వ్యాఖ్యానించిన పైలట్.. అనంతరం మళ్లీ కరోనా గురించి మాట్లాడటం మొదలుపెట్టాడని కాక్పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డైందని వెల్లడించారు. పైలట్లు, అధికారుల తప్పిదం వల్లే ఘోర ప్రమాదం సంభవించిందని సర్వార్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు బుధవారం పాకిస్తాన్ పార్లమెంటుకు ఆయన నివేదిక సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిజానికి విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదు. 100 శాతం ఫిట్గా ఉంది. కెప్టెన్, పైలట్ కూడా అనుభవం కలవారు. అదే విధంగా విమానం నడిపేందుకు పూర్తి ఫిట్గా ఉన్నారు. కానీ వారి మెదడులో కరోనా గురించిన భయాలు నిండిపోయాయి. దాని గురించి చర్చిస్తూ విమాన గమనంపై దృష్టి సారించలేకపోయారు. అందుకే వారితో పాటు ఇతర కుటుంబాలు నష్టపోయాయని తెలిపారు.