పాక్ లో ప్రతి ముగ్గురు పైలట్లలో ఒకరు ఫేక్.. 30 శాతం బోగస్ లైసెన్సులు
పాక్లో వెలుగు చూసిన ఘోర నిజం తెలిస్తే మనం ముక్కున వేలేసుకుంటాం. కానీ పాక్ ప్రజలు మాత్రం భయంతో వణికిపోవాల్సిందే. నకిలీ డిగ్రీ, పీజీ, డాక్టర్ సర్టిఫికేట్లు, నకిలీ భూ డాక్యుమెంట్లు, నకిలీ వాహనలైసెస్సులు, ఓటరు కార్డులు.. అబ్బో… ఇలాంటి నకిలీల గురించి మనం నిత్యం వార్తల్లో చదువుతూనే ఉంటాము. మన ఖర్మరా బాబూ అంటూ సరిపెట్టుకుంటాం. దైనందిన జీవితంలో పడిపోయి ఆ తరువాత విషయం మరచిపోతాం.
అయితే పాక్లో మాత్రం నకిలీల బెడద విశ్వరూపం దాల్చింది. ఎవ్వరూ ఊహించని రేంజ్కు వెళ్లిపోయింది. పాకిస్తాన్లో పనిచేసే పైలట్లలో ముప్పై శాతం మంది బోగస్ పైలట్లు అంట. అంటే ప్రతి ముగ్గురు పైలట్లలో ఒకరు ఫేక్ పైలట్ అన్నమాట.ఇదేమి స్టింగ్ ఆపరేషన్లో బయటపడ్డ విషయం కాదు. ఆ దేశ పౌర విమానాయ శాఖ మంత్రే స్వయంగా బయటపెట్టిన దారుణ వాస్తవం.కరాచీలో జరిగిన విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ విస్తుపోయే విషయం బయటపడింది.
దీని గురించి బుధవారం ఆ దేశ పౌర విమానయాన శాఖ మంత్రి గులామ్ సర్గార్ ఖాన్ పార్లమెంట్ లో మాట్లాడుతూ…పాక్లో 860 మంది పైలట్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 262 మంది పరీక్ష రాయనేలేదు. వారెవరూ పరీక్షకు స్వయంగా హాజరు కాలేదు. తమ తరఫున పరీక్ష రాసేందుకు కొందరికి డబ్బులిచ్చి పంపారు. విమానం నడపడంలో వారికి కావాల్సినంత అనుభవం లేదు. దేశంలోని 30 శాతం పైచిలుకు పైలట్లు విమానం నడిపేందుకు అనర్హులని తెలిపారు.
కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం నకిలీ లైసెన్సులు పొందిన 150 మందిని విధుల నుంచి తొలగించడం అక్కడి ప్రజలకు కాస్త ఊరటనిచ్చే వార్త. మరోవైపు.. ఇటీవల జరిగిన విమాన ప్రమాదానికి కారణమైన పైలట్ల వద్ద ఎటువంటి లైసెన్సులు ఉన్నాయనే దానిపై కూడా ప్రస్తుతానికి క్లారిటీ లేదు.