వందేమాతరం ఆలపించిన పాకిస్థానీలు

  • Published By: venkaiahnaidu ,Published On : July 14, 2020 / 08:55 PM IST
వందేమాతరం ఆలపించిన పాకిస్థానీలు

పాకిస్థానీల నోట భారత జాతీయ గీతం. అవును..అస్సలు నమ్మశక్యంకానీ ఈ ఉదంతం లండన్‌లోని చైనా రాయబార కార్యాలయం వద్ద ఆవిష్కృతమైంది. చైనా విస్తరణవాదంతో విసిగిపోయిన కొందరు పాకిస్థానీ మానవహక్కుల కార్యకర్తలు భారతీయులతో కలిసి లండన్‌లోని చైనా రాయబార కార్యాలయం వద్ద చైనా వ్యతిరేక నినాదాలకు దిగారు. పాకిస్థానీలు కూడా భారతీయులతో కలిసి జనగణమన, వందేమాతరం గీతాలను ఆలపిస్తూ చైనా తీరును ఎండగట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా ‘బాయ్‌కాట్ చైనా’ నినాదాలతో హోరెత్తి పోయింది.

పాకిస్థాన్ ప్రభుత్వం… చైనాతో వంత పాడటం మానుకోవాలని పాకిస్థాన్ మానవ హక్కుల పోరాటకర్త అరిఫ్ అజాకియా నినాదాలు చేశారు. తన జీవితంలో తాను మొదటిసారి వందేమాతరం పాడానని ఆయన అన్నారు. ఈ రోజు నేను తొలిసారిగా భారతీయులతో సమానంగా జనగణమన, వందేమాతం ఆలిపించా అని పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు చెందిన మరో వ్యక్తి కూడా తెలిపారు.

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌‌లో పుట్టి లండన్‌లో ఉంటున్న అంజాద్ ఆయుబ్ మిర్జా, మరికొంత మంది కరాచీకి చెందినవారు, కొంత మంది ఇరాన్ ప్రజలు కూడా చైనా తీరుపై లండన్ ఏంబసీ ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ దేశ వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకుంటోందని వాళ్లు ఫైర్ అయ్యారు. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ పేరుతో… గిల్గిత్-బలిస్థాన్ మధ్య చైనా చిచ్చు పెడుతోందని వారు మండిపడ్డారు. చైనా చెప్పినట్లు వింటూ పాక్ ప్రభుత్వం పీఓకేలో ప్రజలపై అరాచకాలు చేస్తోందని ఆయుబ్ మిర్జా ఆరోపించారు.

గల్వాన్‌లో చైనా దాష్టికానికి వ్యతిరేకంగా చైనా రాయబార కార్యాలయం వద్ద ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో పాక్ సంతతి వారు జనగణమన ఆలపించడం అనేక మందికి ఆకట్టుకుంటోంది. చైనాతో ప్రపంపం విసుగెత్తేపోయిందనే విషయాన్ని మరింత ప్రస్ఫుట పరుస్తోంది.

చైనా తీరును తప్పుపడుతూ… అమెరికా, కెనడా సహా చాలా దేశాల్లో భారతీయులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అత్యాశ పనికిరాదని హెచ్చరిస్తున్నారు. లండన్ వీధుల్లో కూడా చైనాపై వ్యతిరేకత పెరుగుతోంది. “ఫ్రీ టిబెట్, ఫ్రీ హాంకాంగ్, ఫ్రీ ఉయ్‌ఘర్స్” అనే ఫొటో ఒకటి శనివారం రాత్రి అక్కడ చైనా రాయబార కార్యాలయంపై వేలాడుతూ కనిపించింది.

చైనాకి చెందిన 59 యాప్స్ నిషేధించడం ద్వారా ఇప్పటికే చైనాకి భారత్ ఝలక్ ఇచ్చింది . మరిన్ని చర్యలు కూడా తీసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో తోక ముడిచిన డ్రాగన్… లఢక్‌లో సరిహద్దు ప్రాంతాల నుంచి వెనక్కి మళ్లింది. గాల్వాన్ లోయలో ఆయుధాల్ని, గుడారాల్ని కూడా వెనక్కి తీసుకెళ్లింది.