Pandora Papers : నిన్న పనామా.. నేడు పండోరా..! నల్ల కుబేరుల గుట్టు చెప్పిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం
ఏడేళ్ల కాలంలో వచ్చిన ఆఫ్షోర్ లీక్స్, లక్స్ లీక్స్, పనామా పేపర్స్, పారడైజ్ పేపర్స్, ఫిన్సెన్ ఫైల్స్ను మించి...పండోరా ఫైల్స్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి.
Pandora Papers : పండోరా పేపర్స్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. గతంలో ఆఫ్సోర్ లీక్స్, పనామా పేపర్స్, పారడైజ్ పేపర్స్ ప్రపంచ రాజకీయ నేతలు, సంపన్నులు, సినీ, క్రీడా ప్రముఖులను కుదిపేసినట్లే… ఇప్పుడు పండోరా ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంట్స్… పలువురిని షేక్ చేస్తున్నాయి. మనీ లాండరింగ్కు పాల్పడ్డవారి చిట్టాను పండోరా పేపర్స్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం సంస్థ వెలికితీసింది. బ్లాక్ మార్కెటీర్లు, ట్యాక్స్ ఎగవేతదారులు, రహస్య పెట్టుబడిదారుల జాబితాను బహిర్గతం చేశాయి. అక్రమార్జనలతో పలు దేశాల్లో భూములు, స్థలాలు, భవనాలు కొన్నవారిని, బినామీ పేర్లతో సంస్థలు నెలకొల్పినవారిని, వారి బండారాన్ని బహిర్గతం చేశాయి పండోరా పత్రాలు.
ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్స్ I.C.I.J ఆర్గనైజేషన్… బడాబాబుల ఆర్థిక మూలాలపై పండోరా పేపర్స్ తవ్వితీసిన వాస్తవాలను ప్రచురించింది. పలు రంగాలకు చెందిన ప్రముఖుల సంపాదనలో అక్రమార్జననే కాదు… సక్రమంగా ఆర్జించిన దాంట్లో ఎంతమేర ట్యాక్స్లు ఎగ్గొట్టారు, ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు, వాటిని ఎలా కొన్నారు, ఎప్పుడు కొన్నారు, వాటికి సంబంధించిన మనీ డీలింగ్స్ సమగ్ర సమాచారాన్ని పండోరా పేపర్స్ లీక్ చేసింది. ఇందులో 91 దేశాలకు చెందిన పేరు మోసిన రాజకీయనేతలున్నారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, బిలియనీర్లు, దౌత్యాధికారులు పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఉన్నారు.
Pandora Papers: అంతర్జాతీయ సీక్రెట్ బయటపెట్టిన పాండోరా.. మరోసారి ఆర్థిక నేరగాళ్ల గుట్టురట్టు
అంతర్జాతీయంగా 650 మందికి పైగా జర్నలిస్టులు.. ఈ బృహత్తర యజ్ఞంలో తమవంతు కృషిచేశారు. సమాజంలో పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న వారి ఆర్థిక వ్యవహారాలను బహిర్గతం చేసిన ఈ ప్రతాల్లో ఆ దేశం ఈ దేశం అని కాదు. చాలా దేశాల వారి పేర్లుండటంతో ఆయా దేశాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.
బ్లాక్ మనీని ఎలా పెట్టుబడి పెట్టారంటే..?
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు, దీవులు, ప్రాంతాల్లో నల్లధనాన్ని పెట్టుబడిగా పెట్టడం చాలా ఈజీ. దుబాయ్, మొనాకో, కేమన్ ఐలాండ్స్, సమోయ, బెలీజ్, పనామా, బ్రిటీష్ వర్జిన్ ఐలండ్స్, సింగపూర్, న్యూజీలాండ్, సౌత్ డకోటాల్లో.. వ్యక్తులు, ట్రస్ట్ల పేరిట ఆస్తులు కొనుగోలు చేయడమో… కంపెనీలు నెలకొల్పడమో ఎంతో మంది చేస్తుంటారు. ఆయా దేశాల్లో ట్యాక్స్లు ఉండనే ఉండవు. ఉన్నా చాలా తక్కువ. వ్యక్తులు, సంస్థల పేరిట ఆస్తులను థర్డ్ పార్టీ కొనిపెడుతుంది. ఈ తరహా లావాదేవీలను ఆఫ్షోర్ అంటారు. ఇలాంటి లావాదేవీలు జరిపిన పలు దేశాలకు చెందిన కీలక నేతలు, మాజీ నేతలు 35 మంది ఆర్థిక మూలాల్ని పండోరా పేపర్స్ లీక్ చేసింది. 300 మంది పబ్లిక్ ఉన్నతస్థాయి అధికారులు ఎంతలా కూడబెట్టారో లోకానికి చాటింది. 956 కంపెనీల పేరుతో వీరంతా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది.
వారిలో కొందరు వీళ్లే
పండోరా పేపర్స్ లిస్ట్లో ప్రముఖంగా కనిపిస్తున్న వ్యక్తి జోర్డాన్ రాజు. పేరు అబ్దుల్లా. జోర్డాన్ను పాలిస్తున్న కింగ్ అబ్దుల్లా.. 70 మిలియన్ పౌండ్ల అక్రమార్జనతో.. బ్రిటన్, అమెరికాలో ప్రాపర్టీలు కొన్నట్లు పండోరా పేపర్స్ లీక్ చేసింది. అంటే మన కరెన్సీలో 741 కోట్లు విలువైన ఆస్తులు కూడబెట్టారు.
ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ పేరు కూడా పండోరా పేపర్స్లో ఉంది. టోనీ బ్లెయిర్ అతని భార్య..లండన్లోని మే ఫెయిర్ ఆఫీసు కొనుగోలుకు సంబంధించి.. 3 లక్షల 12 వేల పౌండ్ల మేర స్టాంప్ డ్యూటీ చెల్లించలేదట.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు మొనాకోలో ఆస్తులున్నాయని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు తేల్చారు. చెక్ ప్రధానమంత్రి అండ్రేజ్ బాబీస్…అక్రమార్జనతో.. ఫ్రాన్స్లో 12 మిలియన్ పౌండ్ల విలువ చేసే రెండు విల్లాలు కొన్నాడట.
ఏడేళ్ల కాలంలో వచ్చిన ఆఫ్షోర్ లీక్స్, లక్స్ లీక్స్, పనామా పేపర్స్, పారడైజ్ పేపర్స్, ఫిన్సెన్ ఫైల్స్ను మించి…పండోరా ఫైల్స్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు, ఆయా మీడియా హౌజ్లకు సంబంధించిన జర్నలిస్టులు, 14 ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీల ప్రతినిధులు కలిసి దాదాపు 12 మిలియన్లు డాక్యుమెంట్లు, ఫైళ్లు పరిశీలించారు. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్, పనామా, బెలీజ్, సైప్రస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, స్విట్జర్లాండ్ దేశాల్లో ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీల నుంచి సమాచార సేకరణ జరిగింది.