ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న 48గంటల్లోనే నర్సు మృతి

ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న 48గంటల్లోనే నర్సు మృతి

కరోనా నివారణ కోసం అమెరికాకు చెందిన ఫైజర్ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ పోర్చుగల్ నర్సు..వాక్సిన్ వేయించుకున్న 48 గంటల్లోనే చనిపోయింది. పోర్చుగల్ కి చెందిన సోనియా అసేవెడో(41)పోర్టోలోని పోర్చుగీసు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అంకాలజీలో పిడియాట్రిక్‌ అసిస్టెంట్‌ నర్స్‌గా పని చేస్తున్నారు. ఫైజర్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగంలో భాగంగా సోనియా డిసెంబర్-30,2020న వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

ఆ తర్వాత రెండు రోజులకే (జనవరి-1,2021) ఆమె మరణించారు. ప్రస్తుతం ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం కావడమే కాక వ్యాక్సిన్‌ పనితీరు పట్ల మరిన్ని అనుమానాలను, భయాలను పెంచుతుంది. పోర్చుగీసులో 538 ఆరోగ్య కార్యకర్తలు ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

సోనియా తండ్రి అబిలియో అసేవెడో మాట్లాడుతూ..నా కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవు.వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. కానీ వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు రోజుల వ్యవధిలోనే అనూహ్యంగా తను మరణించింది. నా కుమార్తె ఎందువల్ల మరణించిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నానని ఆయన అన్నారు. అంతేకాకుండా, సోనియాకు మద్యం అలవాటు లేదని,ఈ మధ్య కాలంలో ఎలాంటి కొత్త ఆహార పదార్థాలను తీసుకోలేదని.. అంతా సాధారణంగానే ఉందని ఆమె తండ్రి తెలిపారు.

ఇక పోర్చుగీసు ఆరోగ్య శాఖ అధికారులు సోనియా మృతికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు,పది మిలియన్ల జనాభా గల పోర్చుగీసులో 4,32,000 కరోనా కేసులు నమోదు కాగా.. 7,196 మరణాలు నమోదయ్యాయి. 3లక్ష 45వేల మంది కోలుకున్నారు.