హైదరాబాద్ చేరుకున్న రష్యా కరోనా టీకా..రెడ్డీస్ ల్యాబ్ లో 15 నుంచి క్లినికల్ ట్రయల్స్
Russian covid vaccine sputnik arrive india Hyederabad: ప్రపంచం అంతా కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేళ రష్యా కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ తయారు చేసింది. చైనా నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించిన కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచంలోనే తొలిసారి ఈ వైరస్ వ్యాక్సిన్ తయారు చేసిన రష్యా టీకా హైదరాబాద్ చేరుకుంది.
భారత్లోని రెడ్డీస్ ల్యాబ్లో రెండు, మూడో విడత క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు రష్యా ఒప్పందం చేసుకుంది. రెడ్డీస్ ల్యాబ్లో రెండు, మూడో విడత క్లినికల్ ట్రయల్స్ కోసం చేసుకున్న ఒప్పందం కింద స్పుత్నిక్ టీకాలను తీసుకొచ్చారు.
దీంట్లో భాగంగా నవంబర్ 15నుంచి భారత్ లో కరోనా సోకిన రెండు వేల మందిపై క్లినికల్ ప్రయోగాలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన నివేదికలను డీజీసీఐకి అందజేస్తారు. డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ కి 100 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్ను సరఫరా చేయనుంది. స్పుత్నిక్ టీకాలపై వాస్తవానికి భారత్లో 3వ దశ ట్రయల్ మాత్రమే నిర్వహించాలని అనుకున్నారు.
అయితే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, నిపుణుల కమిటీ ఆమోదంతో 2వ దశ ట్రయల్స్ను కూడా చేపడుతున్నారు. 1500 మందితో అడాప్టివ్ ఫేజ్ 2,3 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు టీకాను మార్కెటింగ్ చేస్తున్న ఆర్డీఐఎఫ్ సంస్థ తెలిపింది.
కాగా.. స్పుత్నిక్ టీమ్ వ్యాక్సిన్ ఇప్పటికే 92 శాతం సక్సెస్ సాధించిందని రష్యా అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.