సానియా సెకండ్ ఇన్నింగ్స్: తొలి రౌండ్ అదుర్స్

సానియా సెకండ్ ఇన్నింగ్స్: తొలి రౌండ్ అదుర్స్

సుదీర్ఘ విరామం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో సానియా మీర్జా తొలి మ్యాచ్ గెలిచేసింది. హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం మహిళల డబుల్స్‌ ఈవెంట్ ఆడింది. తన భాగస్వామి నడియా కిచెనొక్(ఉక్రెయిన్)తో కలిసి వొకసానా(జార్జియా)-మియూ కటో (జపాన్)ల జోడీని ఓడించారు.

రెండేళ్ల తర్వాత కోర్టులో అడుగుపెట్టిన సానియా-కిచొనొక్‌తో కలిసి గంట 41నిమిషాల పాటు జరిగిన గేమ్‌లో 2-6 7-6 (3) 10-3 తేడాతో గెలిచింది. తొలి రౌండ్ విజయం తర్వాత ఈ ఇండో ఉక్రెయిన్ జోడీ అమెరికన్ ప్లేయర్లు వానియా కింగ్-క్రిస్టినా మెకలేతో తలపడతారు. రెండేళ్ల విరామం తీసుకున్న సానియా చివరి సారిగా పలు గాయాలతో ఆటకు దూరంగా ఉన్నారు. ఏప్రిల్ 2018లో బాబుకు జన్మనిచ్చిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ను పట్టుదలతో మొదలుపెట్టారు.

 

ఈ ప్రయత్నంలో ఆమె ప్రత్యేకంగా 20కేజీలకు పైగా బరువు తగ్గారు. ఫీవర్ తో బాధపడుతున్నా డైట్ మిస్ కాకుండా బరిలోకి దిగారు. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ‘నా జీవితంలోని ప్రత్యేకమైన రోజుల్లో ఈ రోజు ఒకటి. నా పేరెంట్స్ నా చిన్ని కొడుకు చాన్నాళ్ల తర్వాత మ్యాచ్ ఆడుతుంటే నాతోపాటే ఉన్నారు. మొదటి రౌండ్ గెలిచాం. ఈ ప్రేమను పొందుతున్నందుకు చాలా గొప్పగా అనిపిస్తుంది. నమ్మకమనేది ఎలాంటి స్థానంలోనైనా కూర్చోబెడుతుంది. అవును నాన్నా మనం సాధించాం’ అని కొడుకును ప్రస్తావిస్తూ ట్వీట్ చేసింది.

 

సానియా చివరిసారిగా 2017అక్టోబరులో చైనా ఓపెన్ టోర్నీలో ఆడింది. మోకాలి గాయంతో ఆ టోర్నీ నుంచి తప్పుకుంది. ఆస్ట్రేలియా ఓపెన్లో రోహన్‌ బోపన్నతో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఆడాలని సానియా నిర్ణయించుకుంది. మొదట ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో రాజీవ్‌ రామ్‌తో ఆడాలని అనుకున్న ఈ హైదరాబాదీ తార నిర్ణయం మార్చుకుంది.