ఇమ్రాన్ వక్రబుద్ధి : కశ్మీర్ వేర్పాటువాది గిలానీకి పాక్ అత్యున్నత పౌర పురస్కారం

  • Published By: venkaiahnaidu ,Published On : July 28, 2020 / 04:57 PM IST
ఇమ్రాన్ వక్రబుద్ధి : కశ్మీర్ వేర్పాటువాది గిలానీకి పాక్ అత్యున్నత పౌర పురస్కారం

భారత్‌ను విచ్ఛిన్నం చేసే శక్తులను ప్రొత్సహించడంలో ఎప్పుడూ ముందుండే పాకిస్థాన్.. మరోసారి తన వక్రబుద్దిని ప్రదర్శించింది. కశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరు చేయడానికి కుట్రలు పన్నిన వేర్పాటువాది సయ్యద్‌ అలీ గిలానీ (90)ని గౌరవంతో సత్కరించింది. కశ్మీర్‌ యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించిన గిలానీని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రశంసల్లో ముంచెత్తింది.

పాక్ అత్యున్నత పౌర పురస్కారమైన నిషాన్ -ఈ- పాకిస్తాన్ అవార్డును గిలానీకి ప్రకటించింది ఇమ్రాన్ సర్కార్. కశ్మీర్‌ కల్లోలానికి పరోక్ష కారణమైన సయ్యద్‌కు పాకిస్తాన్‌ అత్యున్నత అవార్డును ప్రకటించడంలో ఆంతర్యం ఏంటన్నిది తెలియరాలేదు. మొత్తానికి కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని ప్రొత్సహించిన గిలానీకి అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిన పాకిస్థాన్.. భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రొత్సహించే వారికి తమ మద్దతు ఉంటుందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది.

మరోవైపు, నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేయడానికి తొలి ఏడాది పూర్తి కావడానికి సరిగ్గా వారం ముందు ఈ అవార్డును ప్రకటించడం గమనార్హం. కాగా ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో 16 పార్టీల కూటమి అయిన హురియత్‌ కాన్ఫరెన్స్ చైర్మన్ పదవికి గిలానీ రాజీనామా చేశారు. సంస్థలో జవాబుదారీతనం లోపించిందని ఆరోపించిన గిలానీ.. సభ్యుల్లో తిరుగుబాటు తనం పెరిగిపోయిందని అన్నారు. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు

కాగా చాలాకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటోన్న గిలానీ గత ఏడాది కేంద్రం ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన దగ్గర్నుంచి అనిశ్చితిలో పడిపోయారు. 1993లో అవిభక్త హురియత్‌ కాన్ఫరెన్స్‌ వ్యవస్థాపక సభ్యుడైన గిలానీ 2003లో భేదాభిప్రాయాలతో వేరు కుంపటి పెట్టారు. అప్పట్నుంచి ఆయనే సంస్థకు జీవితకాల చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన సంస్థ నుంచి వైదొలిగినా పాకిస్తాన్‌ పౌర పురస్కారం ప్రకటించడంతో మరోసారి తెరమీదకు వచ్చారు.