శ్రీలంకలో ఉగ్ర ఉన్మాదం : టూరిస్టుల్లా వచ్చి రక్తపుటేరులు పారించారు

  • Published By: veegamteam ,Published On : April 21, 2019 / 10:54 AM IST
శ్రీలంకలో ఉగ్ర ఉన్మాదం : టూరిస్టుల్లా వచ్చి రక్తపుటేరులు పారించారు

శ్రీలంక రాజధాని కొలంబో రక్తమోడింది. ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. రక్తపుటేరులు పారించారు. ఈస్టర్ పండుగ రోజున చర్చిలు, హోటళ్లు టార్గెట్ గా దాడులకు తెగబడ్డారు. 6 గంటల వ్యవధిలో 8 బాంబులు  పేలాయి. ఈ పేలుళ్లు ఐసిస్ ఉగ్రవాదుల పనేనని శ్రీలంక ప్రభుత్వం భావిస్తోంది. ఐసిస్ శ్రీలంక మాడ్యూల్ కు చెందిన ఆత్మాహుతి దళ సభ్యులే చర్చిలు, హోటళ్లలో పేలుళ్లకు కారకులని శ్రీలంక భద్రతా వ్యవహారాల  మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు చోట్ల ఆత్మాహుతి దాడులకు పాల్పడిన వారిని గుర్తించారు. బట్టికలోవా ప్రాంతంలోని చర్చిలోకి అబు మహ్మద్ అనే ఉగ్రవాది పర్యాటకుడి రూపంలో వెళ్లి ఆత్మాహుతికి పాల్పడినట్టు  గుర్తించారు. జహ్రాయిన్ అనే మరో ఆత్మాహుతి దళ సభ్యుడు షాంగ్రీలా హోటల్ లో తనను తాను పేల్చుకున్నట్టు గుర్తించారు. వీరిద్దరూ ఐసిస్ దళ సభ్యులేనని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి.

ఆదివారం(ఏప్రిల్ 21,2019) ఉదయం 8గంటల 45 నిమిషాల నుంచి 6 గంటల వ్యవధిలో 8 బాంబులు పేలాయి. చర్చిలు, హోటళ్లే టార్గెట్ గా బ్లాస్ట్ లు జరిగాయి. కోచికడే, సెయింట్ సెబాస్టియన్, బట్టికలోవా చర్చిలలో పేలుళ్లు జరిగాయి. షాంగ్రిల్లా, సినామోన్ గ్రాండ్, కింగ్స్ బరీ హోటల్స్ లో బ్లాస్ట్ లు జరిగాయి. 2 చోట్ల ఆత్మాహుతి దాడులు జరిగినట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. బట్టికలోవా చర్చి, హోటల్ షాంగ్రిల్లాలో ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఉగ్రవాదులు ఈస్టర్ వేడుకలను టార్గెట్ చేశారు. శ్రీలంక రాజధాని కొలంబోలోని 3 చర్చిలు, 3 హోటళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు జరిగాయి. వరుస పేలుళ్లతో ప్రజల్లో భయం నెలకొంది. పేలుళ్లలో 35మంది విదేశీయులు చనిపోయారు.

వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక ప్రభుత్వ అలర్ట్ అయ్యింది. కొలంబోలో కర్ఫ్యూ విధించింది. ఆదివారం (ఏప్రిల్ 21,2019) సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం(ఏప్రిల్ 22,2019) ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ  ఉంటుందని చెప్పింది. ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించింది. రూమర్స్ వ్యాప్తి కాకుండా సోషల్ మీడియాపై తాత్కాలిక బ్యాన్ విధించింది. కొలంబోలో ఇంటర్ నెట్ సేవలు నిలిపివేశారు.