దటీజ్ న్యూజిలాండ్..రగ్బీ ఆటకు మాస్కులు పెట్టుకోకుండా 30వేలమంది.. IPL 2020 మాత్రం అభిమానులు లేక ఇలా..

  • Published By: nagamani ,Published On : October 14, 2020 / 12:10 PM IST
దటీజ్ న్యూజిలాండ్..రగ్బీ ఆటకు మాస్కులు పెట్టుకోకుండా 30వేలమంది.. IPL 2020 మాత్రం అభిమానులు లేక ఇలా..

Covid-free New Zealand: ఈ కరోనా కాలంలో మహమ్మారిని జయించిన దేశం అంటే ఠక్కున గుర్తుకొచ్చేది న్యూజిలాండ్. కరోనాను జయించి ప్రశాంతంగా ఉన్న ప్రజలు హాయిగా విహరిస్తున్నారు. క్రీడలకు కనీసం మాస్కులు కూడా పెట్టుకోకుండా వేలాదిమంది హాజరై ప్రపంచ దేశాన్ని షాక్ కు గురిచేస్తోంది న్యూజిలాండ్. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


బ్లెడిస్లో కప్ టెస్ట్ మ్యాచ్‌కు జనాలు పోటెత్తారు. వెల్లింగ్టన్ స్టేడియంలో ఆదివారం (అక్టోబర్ 12,2020) జరిగిన ఈ రగ్బీ మ్యాచ్‌కు ఏకంగా 30 వేల మందికి పైగా హాజరయ్యారు. ఇంత భారీ సంఖ్యలో జనాలు ఒకచోట పోగవ్వటం..వీరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఫేస్ మాస్కులు ధరించకపోవడం..కనీసం భౌతిక దూరం కూడా పాటించకపోవటం ప్రపంచాన్ని నివ్వెరపాటుకు గురిచేస్తోంది.


కరోనా మహమ్మారిని జయించిన తరువాత న్యూజిలాండ్ లోని ఓ స్టేడియంలో మాస్కులు లేకుండా ప్రేక్షకులు కనిపించడం గత ఏడు నెలల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనించాల్సిన విషయం. అంటే కరోనాను జయించామనే కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఎంతగా ఉందో ఊహించుకోవచ్చు.


న్యూజిలాండ్ లో పరిస్థితి అంత హ్యాపీగా సందడి సందడిగా మ్యాచ్ జరుగగా..అదే సమయంలో యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ (ఐపీఎల్ 2020) మ్యాచ్‌లు మాత్రం ప్రేక్షకులు లేకుండానే బయో సెక్యూర్ బబుల్ మధ్య జరుగుతున్నాయి. ఫ్లోరిడాలో జరుగుతున్న నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈక్రమంలో వైరల్ అవుతున్న న్యూజిలాండ్ ఫొటోలు కరోనా ముందు ఎలా ఉండేవారో ఇప్పుడు కూడా న్యూజిలాండ్ వాసులు అలాగే ఉన్నారని ఆనాటి పరిస్థితులను కళ్లను కడుతున్నాయి.


ఈ ఫొటోలు చూసిన ప్రతి ఒక్కరు ప్రధాని జెసిండా అర్డెర్న్‌ను ప్రశంసిస్తున్నారు. కొవిడ్ మహమ్మారిని ఆమె ఎదుర్కొన్న తీరును, వైరస్‌ను కట్టడి చేసేందుకు చేపట్టిన చర్యలను ప్రశంసిస్తున్నారు. ‘‘వారెందు మాస్కులు ధరించలేదు. (ఓహో, అది న్యూజిలాండ్ కదా)’’ అని ఓ యూజర్ రాస్తే, అమెరికా వాళ్లు తమ ఎన్ఎఫ్ఎల్ మ్యాచ్‌లను ఇంట్లో కూర్చుని చూస్తున్నారని, న్యూజిలాండ్ మాత్రం ఇలా జరిగిందని మరో యూజర్ కామెంట్ చేశాడు.


కరోనా వైరస్‌ను న్యూజిలాండ్ రెండుసార్లు తరిమికొట్టింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి ఈ ఏడాది మేలో వైరస్‌ను అక్కడి ప్రభుత్వం నిర్మూలించింది. అయితే, ఆగస్టులో ఆక్లాండ్‌లో కొన్ని కేసులు మళ్లీ వెలుగుచూశాయి. దీంతో అక్కడ మూడు వారాలు లాక్‌డౌన్ విధించారు. అక్కడ మళ్లీ వైరస్ కేసులు వెలుగు చూడకపోవడంతో అక్టోబర్ 5న ప్రధాని జెసిండా ఈ విషయాన్ని నిర్ధారించారు. కరోనా నియంత్రణలోనే ఉందని తెలిపారు.


50 లక్షల మంది జనాభా కలిగిన న్యూజిలాండ్‌లో 25 మంది మాత్రమే కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 1,872 కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం 39 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్టు జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాలను బట్టి తెలుస్తోంది.