భారత ఉద్యమకారిణికి అమెరికా ప్రతిష్టాత్మక పురస్కారం

భారత ఉద్యమకారిణికి అమెరికా ప్రతిష్టాత్మక పురస్కారం

us honours activist anjali bharadwaj : అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్స్‌ అవార్డుకు భారత మహిళ …ప్రముఖ ఉద్యమకారిణి,సామాజిక వేత్త అంజలి భరద్వాజ్‌ ఎంపికయ్యారు. భారత్‌కు చెందిన సామాజిక ఉద్యమకారిణి అంజలి భరద్వాజ్‌ను అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికచేసింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని గుర్తించి, ప్రోత్సహించేందుకు బైడెన్‌ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన ‘అంతర్జాతీయ అవినీతి నిరోధక చాంపియన్స్‌ అవార్డు’కు ఆమె పేరును ప్రకటించింది.

 

అ అవార్డుల కోసం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12 మందిని ఎంపికచేసింది అమెరికా ప్రభుత్వం. వీరిలో భారత్ కు చెందిన అంజలి భరద్వాజ్‌ ఒకరుగా నిలిచారు. సమాచార హక్కు ఉద్యమంలో అంజలి భరద్వాజ్ రెండు దశాబ్దాలకుపైగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని బైడెన్‌ ప్రభుత్వం కొనియాడింది. ‘నేషనల్‌ క్యాంపెయిన్‌ ఫర్‌ పీపుల్స్‌ రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌’కు (ఎన్‌సీపీఆర్‌ఐ) అంజలి కన్వీనర్‌గా ఉన్నారు. ఎన్‌సీపీఆర్‌ఐ పోరాటం ఫలితంగానే అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్‌ ఏర్పాటైంది. అలాగే ప్రజావేగు రక్షణ చట్టం రూపుదిద్దుకుంది.

సాహసోపేత వ్యక్తులకు ఇచ్చే ఈ అవార్డుకు ఎంపికైన 12 మందిలో ఆమె ఒకరిగా నిలిచారు. కాగా..భారత్‌లో 20 ఏళ్లుగా సాగిన సమాచార హక్కు ఉద్యమంలో క్రియాశీలక సభ్యురాలిగా అంజలి వ్యవహరించారు. ప్రభుత్వంలో పాదర్శకత, జవాబుదారీ తనం పెంపొందించేందుకు, ప్రజలను అందులో భాగస్వాములను చేసేందుకు సతర్క్‌ నాగరిక్‌ సంఘటన్‌ (NNS) అనే సంస్థను ఏర్పాటు చేశారు.

అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిని బహిర్గతం చేస్తున్న వ్యక్తులకు రక్షణ కల్పిస్తున్నారు. అవినీతి నిరోధక న్యాయవాదిగా, విజిల్‌ బ్లోయర్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ను ఏర్పాటు చేయాలని అంజలి భరద్వాజ్ విశేషం కృషి చేశారు. అటువంటి అవార్డుకు తనను ఎంపిక చేయటం పట్ల అంజలి భరద్వాజ్ సంతోషం వ్యక్తం చేశారు.

పాదర్శకతను కాపాడటానికి, అవినీతిపై గళమెత్తి… స్వంత దేశంలో జవాబుదారీతనం నిర్ధారించడానికి అవిశ్రాంత కృషి చేసిన వ్యక్తులకు అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్‌ అవార్డులను ప్రకటిస్తున్నామని తెలిపారు అమెరికా విదేశాంగ కార్యదర్శి టోని బింక్లేన్ తెలిపారు‌.