అమెరికా అధ్యక్ష ఎన్నికలు : బైడెన్ కే ‘లిటిల్ ఇండియా’ ఓట్లు

  • Published By: bheemraj ,Published On : November 5, 2020 / 12:44 AM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు : బైడెన్ కే ‘లిటిల్ ఇండియా’ ఓట్లు

US presidential election : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ లో ఎప్పటికప్పుడు లెక్కలు మారుతున్నాయి. కీలక రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు ఆధిక్యం మారుతోంది. గెలుపెవరిదన్నదానిపై క్లారిటీ లేదు. విజయం ఇద్దరి మధ్య దోబూచులాడుతోంది. అటు ట్రంప్, ఇటు బైడెన్ ఇద్దరూ గెలుపు తమదేనని ప్రకటించుకున్నప్పటికీ.. ఎవరూ మ్యాజిక్‌ మార్క్‌కు దగ్గరగా లేరు. స్వింగ్‌ స్టేట్స్‌లో ఇంకా ఫలితం తేలకపోవడంతో విజయం ఊగిసలాడుతోంది. అమెరికా అధ్యక్షుడెవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది.



అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారతీయులు అత్యధికంగా ఉంటారు. అందుకే దాన్ని ‘లిటిల్‌ ఇండియా’ అని వ్యవహరిస్తారు. ఎడ్సన్‌లోని జీపీ స్టీఫెన్స్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటలలోపే 200 ఓట్లు పడ్డాయి. సాయంత్రానికల్లా బ్యాలెట్‌ పత్రాలు అయిపోయాయన్న వార్త తెలిసింది. ఎన్నడూ లేనంతగా అక్కడ పోలింగ్‌ జరిగింది. అక్కడే కాకుండా న్యూజెర్సీ అంతటా ముమ్మరంగా పోలింగ్‌ జరిగింది. భారతీయ అమెరికన్‌ ఓటర్లంతా ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొన్నారు.



‘గత ఎన్నికల వరకే నాకు ఓటు హక్కు వచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో నేను ఓటు వేయలేదు. ఈసారి కృతనిశ్చయంతో ఓటింగ్‌కు వచ్చాను‘ అని అక్కడికెళ్లిన నరేంద్ర కాంచీ అనే ఓటరు భారతీయ మీడియాతో తెలిపారు. జో బైడెన్, కమలా హారిస్‌కే తాను ఓటేసినట్లు ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను కూడా వారికే ఓటు వేసినట్లు ఎడ్సన్‌ పోలింగ్‌ కేంద్రంలో పోల్‌ వర్కర్‌గా స్వచ్ఛందంగా సేవలందిస్తున్న కొలంబియా యూనివర్శిటీ విద్యార్థిని మిల్లీ తెలిపారు.



ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జాతి విద్వేషాలను రెచ్చ గొడుతున్నందున ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సి వచ్చిందన్నారు. భారతీయులు శాంతియుత పరిస్థితులు కోరుకుంటున్నారని, తుపాకీ సంస్కృతిని కాదని బైడెన్‌కు ఓటేసిన గుజరాత్‌కు చెందిన 84 ఏళ్ల శారదాబెన్‌ పటేల్, ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు.

మొదటి సారి ఓటు హక్కు వచ్చిన జేపీ స్టీవెన్స్‌ కాలేజీ గ్రాడ్యువేట్‌ అలేఖ్య బంట్ల, 19 ఏళ్ల శ్రీనివాసన్‌ రామకష్ణన్‌ ఎవరికి ఓటేశారో మీడియాకు చెప్పడానికి సిగ్గు పడ్డారు. ట్రంప్‌ మళ్లీ అధికారంలోకి వస్తే పన్నులు తగ్గిస్తారని తమ తల్లిదండ్రులు చెప్పడం వల్ల తాము ట్రంప్‌కు ఓటు వేసినట్లు తెలిపారు.

బైడెన్‌కు ఓటేసిన భారతీయ అమెరికన్లు ఆ విషయాన్ని బహిరంగంగా చెబుతుండగా, ట్రంప్‌కు ఓటేసిన వారు బయటకు చెప్పలేక పోతున్నారు. ట్రంప్‌కు ఓటేశానంటే ఎక్కడ తిడతారోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. అక్కడి భారతీయ–అమెరికన్లలో ఎక్కువ మంది బైడెన్‌కే ఓటు వేసినట్లు తెలిపారు.