United States: అఫ్ఘాన్ నుంచి వచ్చేశాక తొలిసారి.. తాలిబన్లతో అమెరికా చర్చలు!
అఫ్ఘానిస్తాన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాత మొదటిసారి తాలిబన్లతో చర్చలు జరపబోతున్నట్లు అమెరికా ప్రకటించింది.
US to hold first in-person talks: అఫ్ఘానిస్తాన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాత మొదటిసారి తాలిబన్లతో చర్చలు జరపబోతున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా శనివారం నుంచి తాలిబన్లతో తొలి వ్యక్తిగత చర్చలు జరుపుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. ఖతార్ రాజధాని దోహాలో అమెరికా ప్రతినిధి బృందం సీనియర్ తాలిబాన్ ప్రతినిధులతో శని, ఆదివారాల్లో సమావేశం అవుతుంది.
ఆగస్టులో తాలిబాన్లు అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ను స్వాధీనం చేసుకున్నారు. దీని తరువాత, అమెరికా అఫ్ఘానిస్తాన్ నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది. తాలిబాన్లు అఫ్ఘానిస్తాన్ను కైవసం చేసుకున్న తర్వాత వారిద్దరూ ముఖాముఖి కలవడం ఇదే మొదటిసారి.
అఫ్ఘానిస్తాన్ను తాలిబన్లు దక్కించుకున్నాక.. అక్కడ ఎటువంటి భయానక పరిస్థితులు నెలకొన్నాయో ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. అఫ్గాన్ పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తంచేయగా.. అమెరికా ఏం చర్చిస్తుందో? అనేది ఇప్పుడు ఆసక్తికరం.
తాలిబాన్లపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందా?
అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి ఒక ప్రకటనలో మాట్లాడుతూ, “మహిళలతో సహా అఫ్ఘాన్లందరి హక్కుల గురించి ఆలోచించి, అందరి ఆమోదంతో గౌరవప్రదమైన సమగ్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మేము తాలిబాన్లను ఒత్తిడి చేస్తాము. అఫ్ఘానిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, మానవతా సంక్షోభం ఎదుర్కొంటుంది.
ఆ పరిస్థితులు చక్కదిద్దేందుకే మేం ముందుకు వచ్చాం” అని ఆయన చెప్పారు. అయితే, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలనను అమెరికా గుర్తించడం లేదని అమెరికన్ ప్రతినిధి స్పష్టం చేశారు. అమెరికా పౌరుల తరలింపులో తాలిబాన్లు ఎక్కువగా సహకరించారని అమెరికా చెబుతోంది.