అమెరికాలో సిక్కు రెస్టారెంట్ ‌పై శ్వేతజాతీయుల దాడి.. 

  • Published By: nagamani ,Published On : June 24, 2020 / 08:51 AM IST
అమెరికాలో సిక్కు రెస్టారెంట్ ‌పై శ్వేతజాతీయుల దాడి.. 

అమెరికాలో భారత సంతతి ప్రజలను లక్ష్యంగా చేసుకున్నకొంతమంది ఉన్మాద చర్యలకు పాల్పడ్డారు. న్యూమెక్సికో రాష్ట్రంలోని సాంటే ఫే నగరంలో ఓ సిక్కు వ్యక్తి నిర్వహిస్తున్న ఇండియన్ ప్యాలెస్ రెస్టారెంట్‌ను దుండగు ధ్వంసం చేశారు.  

రెస్టారెంట్‌లోకి చొరబడి ఫర్నీచర్‌ను, వంటసామాగ్రిని ధ్వంసం చేశారు. దేవతావిగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. రెస్టారెంట్ గోడలపై జాతి వ్యతిరేక వ్యాఖ్యలు రాశారు.‘ఫక్ యూ ఐఎస్ఐఎస్, గో బ్యాక్’ అంటూ హెచ్చరించారు. వైట్ సూపర్ మాటిస్ట్ అని, ట్రంప్2020 కూడా రాశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హోటల్‌ను ముస్లింలు నడుపుతున్నారని భావించి ఈ దాడులు చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 80 లక్షల ఆస్తినష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 

కాగా..60 ఏళ్లగా శాంటా ఫే సిటీలో స్థిరపడిన సిక్కు మతానికి చెందినవారు ఈ ప్యాలెస్‌ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఉన్మాదులుగా మారి రెస్టారెంట్ లో నానా హంగామా సృష్టించారు. రెస్టారెంట్‌లోని టేబుల్స్‌ను పడేశారు. అద్దాలు పగులగొట్టారు. కిచెన్‌లోని వస్తువులను ధ్వంసం చేశారు. కంప్యూటర్లను లూటీ చేశారు. ఆ రెస్టారెంట్‌ గోడలపై జాతి అహంకార వ్రాతలు రాశారు. ‘తెల్లవారిదే అధికారం.. మళ్లీ ట్రంప్‌ ప్రభుత్వమే.. మీ దేశానికి వెళ్లిపోండి’ అని గోడలు, డోర్లపై రాశారు. 

రెస్టారెంట్ ను నాశనం చేయవద్దని తాను ఎంతగా ప్రాధేయపడినా వారు వినకుండా రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారని..జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారని రెస్టారెంట్‌ యజమాని బల్జిత్ సింగ్ వాపోయారు. సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (ఎస్‌ఏఎల్‌డీఈఎఫ్‌) ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. న్యూ మెక్సికోలో ఓవైపు నల్లజాతీయుల నిరసన మరోవైపు స్పానిష్ వలసవాదుల విగ్రహాలను తొలగించాలంటూ ఆందోళనలు జరుగుతున్న తరుణంలో భారతీయులకు చెందిన రెస్టారెంట్‌పై దాడి జరపటం గమనించాల్సిన విషయం. ఈ ఘటన స్థానికంగానే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా కలకలం రేపింది.

Read: నాన్నఇచ్చిన నాణెంతో..లక్ లక్కలా అతుక్కుంది : రూ.60కోట్ల లాటరీలు గెలిచిన అదృష్టవంతుడు