వ్యాక్సిన్ “జాతీయవాదం”మేలు చేయదు…WHO చీఫ్
కొన్ని దేశాలు ఇతరులకు సాయం చేసే విధంగా లేవని, ఆ దేశాలు తమ స్వంత లాభాల కోసమే వ్యాక్సిన్ వేటలో పడ్డాయని, అన్ని దేశాలు కోలుకుంటేనే వారికి కూడా లాభం జరుగుతందని డబ్ల్యూహెచ్వో చీఫ్ తెలిపారు. సంపన్న దేశాలు జాతి ప్రయోజనాల దృష్ట్యా టీకాలను ఉత్పత్తి చేయడం సరికాదు అని, కరోనా వైరస్ను అంతం చేసే టీకాలను ప్రపంచవ్యాప్తంగా పంచుకోవాలని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియేసస్ తెలిపారు.
జెనీవాలోని డబ్ల్యూహెచ్వో కార్యాలయం నుంచి అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో వీడియో లింక్ ద్వారా టెడ్రోస్ మాట్లాడారు.వ్యాక్సిన్ జాతీయవాదం మంచిదికాదు, అది మనకు ఎటువంటి సహాయం చేయదు అని టెడ్రోస్ ఓ సమావేశంలో తెలిపారు. కరోనా వైరస్ నుంచి ప్రపంచం వేగంగా కోలుకోవాలంటే .. అప్పుడు అన్ని దేశాలు ఒక్కటిగా కలిసి కోలుకోవాలని, ఎందుకంటే మనం ప్రపంచీకరణ చెందామని, ఒక్కొక్క దేశ ఆర్థిక వ్యవస్థ అంతర్లీనమై ఉన్నాయని, కొన్ని దేశాలే సురక్షితంగా ఉండలేవని టెడ్రోస్ తెలిపారు.
వ్యాక్సిన్ కోసం నిధులు ఇస్తున్న దేశాలు ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటే, అప్పుడు కోవిడ్19 వల్ల ప్రమాదం తక్కువగా ఉంటుందని టెడ్రోస్ అన్నారు. కొన్ని దేశాలు తమ స్వంత లాభాల కోసమే వ్యాక్సిన్ వేటలో పడ్డాయని తెలిపారు. కోవిడ్19ను ఓడించేందుకు రకరకాల టీకాల అవసరం ఉంటుందన్నారు. ప్రస్తుతం 26 రకాల వ్యాక్సిన్ల ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు. ఆరు వ్యాక్సిన్ల ట్రయల్స్ మూడవ దశలో ఉన్నట్లు చెప్పారు.
మూడవ దశకు చేరుకున్నంత మాత్రాన టీకా సక్సెస్ అయినట్లు కాదు అని డబ్ల్యూహెచ్వో ఎమర్జెన్సీస్ డైరక్టర్ మైఖేల్ ర్యాన్ తెలిపారు. ఫేస్ త్రీ అంటే.. వ్యాక్సిన్ను సాధారణ ప్రజలకు ఇచ్చినట్లు అని, అంటే ఆరోగ్యకరమైన మనుషులకు టీకాను ఎక్కించినట్లు అని, అయితే ఆ టీకా ఎంత వరకు సహజ సంక్రమణను ఆపుతుందో చూడాలన్నారు.