కమ్ముకున్న యుద్ధ మేఘాలు : అమెరికా దళాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఆర్మీ చీఫ్ సులేమాని హత్య తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికా దళాలే లక్ష్యంగా దాడులకు దిగింది.
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఆర్మీ చీఫ్ సులేమాని హత్య తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికా దళాలే లక్ష్యంగా దాడులకు దిగింది.
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఆర్మీ చీఫ్ సులేమాని హత్య తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికా దళాలే లక్ష్యంగా దాడులకు దిగింది. సులేమాని అంత్యక్రియలు జరిపిన వెంటనే…. ప్రతీకార చర్యలను ప్రారంభించింది. ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై మిస్సైల్స్ను ప్రయోగించింది. అమెరికా సైనిక, సంకీర్ణ దళాలకు ఆశ్రయం ఇస్తున్న రెండు ఇరాకీ సైనిక స్థావరాలైన అల్ అసాద్, ఇర్బిల్పై 12 క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా వెంటనే తన బలగాలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించింది.
ఇరాన్ క్షిపణి దాడుల్లో భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు… ఇరాన్ దాడులను పెంటగాన్ ధృవీకరించింది. దాడిలో జరిగిన నష్టంపై అమెరికా అంచనా వేస్తోంది. ఈ దాడులను ఖండించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తాజా పరిస్థితులను సమీక్షించేందుకు వైట్హౌస్లో అధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. దాడులపై పూర్తి నివేదికను ట్రంప్కు సమర్పించామన్న అమెరికా రక్షణశాఖ… సరైన సమయంలో బదులిస్తామని ప్రకటించింది. ట్రంప్ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
మొత్తంగా ట్రంప్ హెచ్చరికలు, ఇరాన్ ప్రతీకారేచ్ఛతో ప్రపంచం మొత్తాన్ని యుద్ధం ముప్పు భయపెడుతోంది. ఇరాన్లోని 52 ప్రాంతాలను టార్గెట్ చేశామని, ప్రపంచంలోని అత్యాధునిక సైనిక వ్యవస్థ తమ సొంతమని ఇరాన్ను ట్రంప్ హెచ్చరించగా… ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటోంది. మాటలతోకాదు చేతల్లో చూపిస్తామంటూ తాజా దాడులతో అమెరికాకు హెచ్చరికలు పంపింది.
అంతేకాదు… సులేమానిని హతమార్చిన అమెరికా బలగాలన్నింటిని ఉగ్రవాదులుగా పేర్కొంటూ ఇరాన్ పార్లమెంట్ ఓ బిల్లును ఆమోదించింది. దీంతో అమెరికాకు చెందిన అన్ని భద్రతా బలగాలు, పెంటాగాన్ ఉద్యోగులు, అనుబంధ సంస్థలు, ఏజెంట్లు, కమాండర్లు.. సులేమాని హత్యకు ఆదేశించిన వారందరూ ఇరాన్ ఉగ్రవాదుల జాబితాలో చేరారు. సులేమాని హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం తమ ముందు 13 మార్గాలున్నాయన్న ఇరాన్… తమ చారిత్రక స్థలాలపై దాడి చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలను అసలు పట్టించుకునే అవసరమేలేదన్నట్లుగా వ్యవహరిస్తోంది.
2018లో ఇరాన్తో అమెరికా అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అందులోభాగంగానే ఈనెల 3న ఇరాక్ రాజధాని బాగ్దాద్ విమానాశ్రయంలో సులేమాని ప్రయాణిస్తున్న కాన్వాయ్పై డ్రోన్లతో దాడిచేసింది అమెరికా. ఈ దాడుల్లో సులేమానితోపాటు ఇరాక్ పారామిలిటరీ బలగాల డిప్యూటీ చీఫ్, ఇరాన్కు మద్దతుగా వ్యవహరించే కొందరు స్థానిక మిలిటెంట్లు మరణించారు. ఆ తర్వాత.. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్… ఇపుడు అన్నంతపని చేసింది.