War On Obesity : బరువు తగ్గితే బోనస్‌లు, డిస్కౌంట్లు, నగదు ప్రోత్సాహాకలు.. పౌరులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్

యావత్ దేశాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి.. యూకేకి మరో పెద్ద సమస్యే తెచ్చి పెట్టింది. అదే బరువు. అవును ఆ దేశ పౌరుల్లో చాలామంది లావు పెరిగారు. సుదీర్ఘ లాక్‌డౌన్ కారణంగా అనేక మంది ఇళ్లలో

War On Obesity : బరువు తగ్గితే బోనస్‌లు, డిస్కౌంట్లు, నగదు ప్రోత్సాహాకలు.. పౌరులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్

War On Obesity

War On Obesity : యావత్ దేశాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి.. యూకేకి మరో పెద్ద సమస్యే తెచ్చి పెట్టింది. అదే బరువు. అవును ఆ దేశ పౌరుల్లో చాలామంది లావు పెరిగారు. సుదీర్ఘ లాక్‌డౌన్ కారణంగా అనేక మంది ఇళ్లలో ఖాళీగా ఉన్నారు. నోటికి పని చెప్పారు. ఇష్టానుసారంగా తిన్నారు. కట్ చేస్తే.. చాలా మంది బరువు పెరిగారు. యూకేలో నిర్వహించిన ఓ సర్వేలో 41 శాతం మంది తాము లావయ్యామని ఒప్పుకున్నారు. సగటున ఒక్కొక్కరు 4 కిలోలు పెరిగినట్లు అక్కడి ‘నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌)’ అంచనా వేసింది. దీంతో దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సన్నబడాలని తమ దేశ పౌరులకు సూచించింది.

ఇందులో భాగంగా ప్రభుత్వం తరుఫున కొన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎన్‌హెచ్‌ఎస్ సిద్ధమైంది. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని ప్రజలకు సూచించింది. టీవీల్లో జంక్‌ ఫుడ్‌కు సంబంధించిన యాడ్స్ పై నియంత్రణ విధించింది. ఆహార పదార్థాల్లో ఉండే క్యాలరీల వివరాల్ని అందరికీ తెలియజేసేలా పోస్టర్లు పెట్టాలని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్న భోజనంలో ఆరోగ్యకరమైన ఆహారం అందించేలా చర్యలు చేపట్టింది. జంక్‌ ఫుడ్‌లపై ట్యాక్స్ పెంచాలన్న ప్రతిపాదనా ఉంది. బరువు తగ్గడానికి ఉపయోగపడే యాప్‌లు, ప్రణాళికలను ఎన్‌హెచ్‌ఎస్ ప్రోత్సహిస్తోంది. అలాగే బరువును తగ్గించుకునేందుకు ఉపయోగపడే ఆహార పదార్థాల తయారీకి సంబంధించిన యాడ్స్ టీవీల్లో ఇస్తోంది.

ప్రత్యేక ప్రోత్సాహకాలు…
ప్రజలు బరువు తగ్గి.. ఆరోగ్యంగా ఉండటం కోసం బ్రిటన్‌ ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమాన్ని అమలు చేయబోతుంది. బ్రిటన్‌ పౌరుల్లో ఎవరైతే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారో వారికి నగదు ప్రోత్సాహకాలు, బోనస్‌లు, డిస్కౌంట్‌ కూపన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జంక్‌ఫుడ్‌ తినడం మానేసి, ఎక్కువ కూరగాయాలు.. పండ్లు తినేవారికి ఈ ప్రోత్సాహకాలు అందించనున్నారట. ఒబెసిటీపై పోరాటంలో భాగంగా ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరీస్‌ జాన్సన్‌ సైతం ఈ కార్యక్రమంలో భాగమై బరువు తగ్గుతానని ప్రతిజ్ఞ చేశారు.

ఈ ప్రోత్సాహకాలకు అర్హులను ఎంపిక చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ఈ యాప్‌ ద్వారా సూపర్‌ మార్కెట్లలో పౌరుల నెలవారీ కొనుగోళ్ల లెక్కలను విశ్లేషించనున్నారు. ఎవరైతే జంక్‌ఫుడ్‌ను తగ్గించి.. కూరగాయాలు, పండ్లు కొనుగోలు చేస్తారో వారిని గుర్తించి యాప్‌ ద్వారానే లాయల్టీ పాయింట్లు ఇస్తారు. విద్యాసంస్థలకు, ఆఫీసులకు వాహనాల్లో కాకుండా కాలినడక వెళితే అదనంగా మరిన్ని పాయింట్లు లభిస్తాయి. అలా వచ్చిన పాయింట్లను క్యాష్‌బ్యాక్‌ రూపంలో నగదుగా మార్చుకోవచ్చు లేదా డిస్కౌంట్‌.. ఫ్రీ టికెట్స్‌ పొందొచ్చు. ఈ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం అమలుకు, యాప్‌ అందుబాటులోకి తేవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇలాంటి కార్యక్రమమే దుబాయ్‌లో కొన్నేళ్ల కిందటి నుంచి అమలు చేస్తున్నారు. అక్కడ కూడా ఊబకాయం(ఒబెసిటీ), అధిక బరువు సమస్యలు ఉండటంతో ఈ వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. పౌరులు తమ శరీర బరువులో ఎన్ని కిలోలు తగ్గితే అన్ని గ్రాముల బంగారం ఇస్తున్నారు.