Rice From Heaven: స్పేస్ రైస్ పండిస్తున్న చైనా.. ప్రత్యేకత ఏంటంటే?
ప్రపంచ దేశాలలో ఇప్పుడు మాయలమారిగా కనిపిస్తున్న చైనా కొన్ని అద్భుతాలకు నెలవే. ప్రపంచం దృష్టిలో దోపిడీదారుగా కనిపించే చైనా ప్రయోగాలలో కూడా దూసుకుపోతుంటుంది. అలా ప్రపంచ ప్రయోగశాలైన చైనా.. ఇప్పుడు రోదసి నుంచి తెచ్చిన విత్తనాలతో పంటను పండించబోతుంది. దానికి ‘రైస్ ఆఫ్ హెవెన్’ లేదా ‘ స్పేస్ రైస్ ‘గా పేరు పెట్టింది.
Rice From Heaven: ప్రపంచ దేశాలలో ఇప్పుడు మాయలమారిగా కనిపిస్తున్న చైనా కొన్ని అద్భుతాలకు నెలవే. ప్రపంచం దృష్టిలో దోపిడీదారుగా కనిపించే చైనా ప్రయోగాలలో కూడా దూసుకుపోతుంటుంది. అలా ప్రపంచ ప్రయోగశాలైన చైనా.. ఇప్పుడు రోదసి నుంచి తెచ్చిన విత్తనాలతో పంటను పండించబోతుంది. దానికి ‘రైస్ ఆఫ్ హెవెన్’ లేదా ‘ స్పేస్ రైస్ ‘గా పేరు పెట్టింది. ప్రస్తుతం రోదసి నుంచి ఒక సెంటీమీటర్ పొడువుతో ఉన్న 40 గ్రాముల తిండి గింజలు చైనాకు రాగా దక్షిణ చైనా వ్యవసాయ యూనివర్సిటీలోని ల్యాబ్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ విత్తనాలతో సాగు చేపట్టారు.
ఈ పంట ద్వారా పండించిన ధాన్యం మార్కెట్లోకి అందుబాటులోకి రావాలంటే మరో 3-4 సంవత్సరాలు పట్టే అవకాశం ఉండగా.. ఇప్పుడు ఈ వరి సాగు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. ఒక్క వరి మాత్రమే కాదు టొమాటో, పత్తి వంటి 200 పంటలపై కూడా ఈ తరహా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇలా రోదసి విత్తనాలతో పంటలు పండించడమే కాదు.. కుదిరితే చైనా చంద్రునిపై ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. అంతరిక్షంలో పంటలను పండించడానికి గ్రీన్ హౌస్ లను ఉపయోగించే విధానాన్ని పరిశీలిస్తోంది.
అసలు ఈ హెవెన్ రైస్ అంటే ఏంటి?
చంద్రుడిపై పరిశోధనల కోసం గత నవంబర్లో చైనా ఛాంగే-5 వ్యోమనౌకను పంపించింది. ఈ వ్యోమనౌకలో 40 గ్రాముల బరువున్న 1,500 వరి విత్తనాలను అంతరిక్షంలోకి పంపిన చైనా.. ఇప్పుడు ఆ వరి విత్తనాలు తిరిగి స్పేస్ క్రాఫ్ట్ ద్వారా భూమికి చేరుకుంది. చంద్రుడి చుట్టూ 23 రోజులపాటు 7.60 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణం చేసిన అనంతరం డిసెంబర్లో ఈ వ్యోమనౌక భూమికి తిరిగిరాగా.. దీంతో పాటు ఆ ధాన్యం కూడా వచ్చింది. దాదాపు మూడు వారాలపాటు రోదసిలో ప్రయాణం చేసిన ఈ ధాన్యాన్ని ‘స్పేస్ రైస్’గా పిలుస్తున్నారు. ఈ విత్తనాలను కాస్మిక్ రేడియేషన్ అండ్ సున్నా గురుత్వాకర్షణకు గురైన తరువాత తిరిగి భూమికి తీసుకువచ్చారు. ఈ విత్తనాలు కొంతకాలంపాటు అంతరిక్ష వాతావరణంలో ఉన్న తరువాత చాలా మార్పులు జరుగుతాయి. వీటిని అంతరిక్షం నుండి తిరిగి తీసుకువచ్చిన తరువాత భూమిపై పండించిన పంట కంటే ఎక్కువ దిగుబడిని ఇస్తుంది.
ఎప్పుడు ఈ స్పేస్ రైస్ అందుబాటులో వస్తుంది?
రోదసి నుండి తీసుకొచ్చిన రైస్ తో చైనా గ్వాంగ్డాంగ్లోని దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్పేస్ బ్రీడింగ్ రీసర్చ్ సెంటర్ లో మొదటి పంటను మొదలుపెట్టారు. దాని నుండి సేకరించిన మంచి, ఉత్తమమైన విత్తనాలను ప్రయోగశాలలలో పెంచి ఆపై పొలాల్లో పండించనున్నారు. ఇలా చైనా వరి, ఇతర పంటల విత్తనాలను 1987 నుండి అంతరిక్షంలోకి తీసుకువెళ్లి.. తీసుకొచ్చి పంటలు మొదలుపెట్టింది. మరో మూడు లేదా నాలుగేళ్ళలో చైనాలో ఈ స్పేస్ రైస్ పంట మార్కెట్ లో అందుబాటులోకి రానుండగా మిగతా చాలా రకాల పంటల దిగుబడులు అంతకన్నా ముందే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.