కరోనా వేళ మరో ప్రాణాంతక వైరస్ విజృంభణ, ఆ 6 దేశాలకు అలర్ట్

కరోనా వేళ మరో ప్రాణాంతక వైరస్ విజృంభణ, ఆ 6 దేశాలకు అలర్ట్

who alerts six african countries ebola: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి కబళిస్తున్న వేళ.. మరో మహమ్మారి ముంచుకొస్తోంది. ఆఫ్రికాలోని పలు దేశాల్లో ప్రాణాంతక ఎబోలా(Ebola) వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గినియాలో ఈ వ్యాధి బారినపడి ఇప్పటికే ఐదుగురు చనిపోయారు. ఆఫ్రికాలోని పలు దేశాల్లో పెద్ద ఎత్తున ఎబోలా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మరిన్ని కేసులు నమోదయ్యే ప్రమాదం ఉండటం, మరిన్ని దేశాలకు వైరస్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆఫ్రికాలోని ఆరు దేశాలను అలర్ట్ చేసింది.

కాంగోలో 300, గినియాలో 109 ఎబోలా కేసులు:
ఒక్క కాంగోలోనే ఇప్పటివరకు 300కేసులను గుర్తించగా, గినియాలో దాదాపు 109కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి మార్గరెట్‌ హారిస్ వెల్లడించారు. వీటితో పాటు మరో రెండు దేశాల్లోనూ ఎబోలా కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే, వీటి మూలాలను తెలుసుకునేందుకు ఇప్పటికే నమూనాలను విశ్లేషిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఎబోలా (Ebola) ఎలా పుట్టింది?
ప్రాణాంతక ఎబోలా వ్యాధిని తొలిసారి 1976లో ఆఫ్రికాలో గుర్తించారు. ముఖ్యంగా 2013-16 మధ్యకాలంలో తీవ్ర ప్రభావం చూపిన ఈ వైరస్‌.. అప్పట్లో 28వేల 646 మందిలో బయటపడింది. వీరిలో 11వేల 323 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అనంతరం కాంగోలోనూ ఎబోలా విజృంభించింది. ఈ ప్రాణాంతక ఎబోలా వైరస్‌ వల్ల జ్వరం, కండరాల నొప్పి, విరేచనాలు, వాంతులు కావడంతో పాటు కాలేయం, మూత్రపిండాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొందరిలో శరీరం లోపల, బయట రక్తస్రావం జరుగుతుంది. ఎబోలా వల్ల దాదాపు 90శాతం ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంది.

2016 తర్వాత మళ్లీ వ్యాప్తి:
ఆఫ్రికాలోని గినియా దేశంలో ఎబోలా వ్యాప్తి మొదలైనట్లు అక్కడి ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది. గినియాలో 2013-16 తర్వాత మరోసారి ఎబోలా వ్యాప్తి వెలుగుచూసింది. ఇక డెమొక్రాటిక్ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో ఫిబ్రవరి 7న ఎబోలా కేసులు‌ బయటపడినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే కరోనా వైరస్‌తో సతమతమవుతున్న ఆఫ్రికాలో ఎబోలా వెలుగు చూడడం కలవరపెట్టే విషయమని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.