Covid Booster Dose: బూస్టర్ డోస్ అప్పుడే వద్దు.. WHO సూచన!
రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు మూడో డోస్ విషయంలో మాత్రం తొందర పడొద్దని, ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. కోవిడ్ -19 వ్యాక్సిన్ బూస్టర్ డోసును అప్పుడే వేయొద్దని ప్రపంచ దేశాలకు సూచించింది WHO.
Covid Booster Dose: రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు మూడో డోస్ విషయంలో మాత్రం తొందర పడొద్దని, ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. కోవిడ్ -19 వ్యాక్సిన్ బూస్టర్ డోసును అప్పుడే వేయొద్దని ప్రపంచ దేశాలకు సూచించింది WHO. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్, వ్యాక్సినేషన్ విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈమేరకు సూచనలు చేశారు.
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టడంలో రెండు మోతాదుల వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులకు బూస్టర్ డోస్ ఇవ్వడం ప్రభావవంతంగా ఉంటుందని సైన్స్ ఇంకా నిరూపించలేదని డబ్ల్యూహెచ్ఓ అధికారులు చెబుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యాక్సిన్ యాక్సెస్ మెరుగుపరచడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని WHO పదేపదే ధనిక దేశాలకు పిలుపునిచ్చింది. కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోసు వేసే విషయాన్ని కనీసం సెప్టెంబరు ముగిసేవరకు వాయిదా వేసుకోవాలని సంపన్న దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సూచించింది. ముందుగా అన్ని దేశాల్లో కనీసం 10శాతం ప్రజలకు రెండు డోసులు అందేలా చూడాలని WHO కోరింది.
భారతదేశం విషయానికి వస్తే, కోవిన్ సిస్టమ్లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, దేశంలోని అర్హతగల జనాభాలో 10 శాతానికి పైగా వ్యాక్సిన్లు వేసింది ప్రభుత్వం. ఇప్పుడు మన దేశంలో వ్యక్తులకు బూస్టర్ డోస్ ఇవ్వాలా? వద్దా? అనే దానిపై చర్చ జరుగుతోంది. భారతదేశంలో అర్హులైన 94 కోట్ల జనాభాలో, 27 శాతం మందికి ఒకే మోతాదు మాత్రమే లభించింది, ఇంకా చాలామందికి టీకాలు వేయలేదు.
భారతదేశంలో ఈ ఏడాది జనవరి 16వ తేదీ నుండి కరోనా వైరస్కి వ్యతిరేకంగా వ్యాక్సిన్ డ్రైవ్ స్టార్ట్ అయ్యింది. కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ వ్యాక్సిన్ భారతదేశంలో ఎక్కువగా వేశారు. ఈ మోతాదులలో ఎక్కువ భాగం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే ద్వారా అందించబడ్డాయి. ఈ కంపెనీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ను తయారు చేస్తోంది. అయితే, కోవిడ్ -19 బూస్టర్ డోస్ను ఇంకా పరిగణనలోకి తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం సూచించింది.