కరోనావైరస్ ల్యాబ్ల నుంచి లీక్ అవలేదు: WHO
Coronavirus Leak: కరోనావైరస్ చైనా ల్యాబ్లలో పుట్టలేదని.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) పేర్కొంది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి గురించి చైనా సైంటిస్టుల టీం రీసెంట్ గా ఈ విషయాన్ని వెల్లడించాయి. ఒక జంతువు నుంచే మనుషులకు వ్యాపించి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.
2019లోనే చైనాలోని వుహాన్ నగరంలోనే కరోనా కేసులు తొలిసారిగా వెలుగుచూశాయి. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో అనేక రకాల వైరస్ శాంపుల్స్ను స్టోర్ చేశారు. అక్కడి నుంచి లీకైన కరోనా.. సమీప ప్రాంతాల్లోకి వ్యాపించి ఉంటుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చైనా ఖండించి వైరస్ మరెక్కడో పుట్టి ఉంటుందని పేర్కొంది. దీనిపై కన్ఫర్మేషన్ కోసం.. మూలాలను శోధించేందుకు WHOకు చెందిన ఎక్స్పర్ట్ టీం జనవరి 14న వుహాన్ చేరుకుంది. మొదట కరోనా కేసులు వెలుగు చూసిన హువానన్ సీ ఫుడ్ మార్కెట్ సహా అనేక ప్రాంతాల్లో సెర్చింగ్ చేసింది.
తాజాగా చైనా సైంటిస్టులతో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడింది. మహమ్మారి తొలి రోజులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అవగాహన.. పర్యటనతో పెద్దగా మారలేదని డబ్ల్యూహెచ్వో బృందం నాయకుడు పీటర్ బెన్ ఎంబ్రేక్ చెప్పారు. ‘కరోనా వైరస్.. వైరాలజీ ల్యాబ్ నుంచి లీకై, మానవుల్లోకి వ్యాపించి ఉండటానికి ఆస్కారం లేదు. గబ్బిలం నుంచి మరో జంతువులోకి ప్రవేశించి ఉంటుంది. దాని నుంచి మానవుల్లోకి వ్యాపించి ఉండొచ్చని ప్రాథమిక విశ్లేషణల్లో వెల్లడైంది’ అని పేర్కొన్నారు.
గబ్బిలాల నుంచి అలుగు అనే మరో జంతువు ద్వారా మానవుల్లోకి ప్రవేశించి ఉంటుందనే అంచనాలు ఉన్నాయని చెప్పారు. నేరుగా గబ్బిలాల నుంచి లేదా కూలింగ్ ప్రొడక్ట్ల బిజినెస్ ద్వారా కూడా మానవుల్లోకి వైరస్ వ్యాప్తి చెంది ఉండటానికీ అవకాశం ఉందన్నారు. కుందేళ్లు, బేంబూ ర్యాట్స్ సహా హువానన్ సీఫుడ్ మార్కెట్లోని కొన్ని జంతువులకు వైరస్ సోకే ముప్పు ఉందని WHO బృందం సభ్యురాలు మరియన్ కూప్మాన్స్ పేర్కొన్నారు.
WHO బృందంలో 10 దేశాల నుంచి వచ్చిన ఎక్స్పర్ట్లు ఉన్నారు. తీవ్ర అంతర్జాతీయ ఒత్తిడి, నెలల తరబడి చర్చల తర్వాతే ఈ టీం పర్యటనకు చైనా అంగీకరించింది. ఊహించినదాని కన్నా ఎక్కువగానే చైనా అధికారులు తమకు సహకరించారని WHO సభ్యుడు పీటర్ డాస్జాక్ పేర్కొన్నారు. అన్ని కేంద్రాలు, సంస్థలను తమకు అందుబాటులో ఉంచారని చెప్పారు.