Wild Boar In Metro: మెట్రో ట్రైన్ లో అడవిపంది..దర్జాగా సీట్లో పడుకుని ప్రయాణం
Wild Boar In Metro: హాంకాంగ్ లోని మెట్రో రైల్లో ఓ అడవిపంది హల్చల్ చేసింది. ఓ అడవి పంది సమీపంలోని అడవుల్లోంచి క్వారీ బే రైల్వే స్టేషన్ కు వచ్చింది. టికెట్ కౌంటర్ సందులోంచి ఫ్లాట్ ఫామ్ మీదకు వెళ్ళింది. అక్కడ రైలు ఆగి ఉండటంతో అందులోకి ఎక్కింది. దానిని చూసిన ప్రయాణికులు భయపడిపోయారు. బోగీలో అటు ఇటు తిరిగి అలిసిపోయి సీట్లో పడుకుంది. అయితే ఆ అడవిపంది కొన్ని స్టేషన్లు దాటిన తర్వాత దిగి మరో రైల్లోకి ఎక్కింది.
ఇది ఒక రైల్లోంచి మరో రైల్లోకి మారుతుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో రైలు ప్రయాణం చేసిన అనుభవం ఉన్నట్లుగా ఆ పంది ప్రవర్తించింది. రెండవసారి ఎక్కిన రైలు డీపోకి వెళ్లడంతో, అక్కడ ఉన్న అధికారులు దానిని పట్టుకొని సమీపంలోని అడవిలో వదిలేశారు.
అయితే దట్టమైన అడవులతో ఉండే హాంకాంగ్ దేశంలో అడవి పందుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇవి కొన్ని సార్లు రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ జామ్ కు కారణం అవుతుంటాయి. ఇక బీచ్ లలో కూడా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్ లోకి వస్తుంటాయి. అడవి పందుల సంఖ్య అధికంగా ఉన్నా, ఎప్పుడు ఎవరికి హాని కనిగించలేదని చెబుతున్నారు అధికారులు.