నదిలో పేలిన రెండో ప్రపంచ యుద్ధంనాటి బాంబు
Poland : ఎప్పుడో రెండవ ప్రపంచం యుద్ధం కాలం నాటి బాంబులు కొన్ని ఇప్పటికీ భూమిలో నిక్షిమై ఉండిపోయాయి. తవ్వకాల్లో అవి బయట పడుతుంటాయి.అటువంటిదే రెండవ ప్రపంచ యుద్ధానికి చెందిన భారీ బాంబు పోలాండ్ నదీలో బయట పడింది. టాల్బాయ్ గా పిలిచే ఈ బాంబు దాదాపు 5400 కిలోలు ఉంటుందని నౌకాదళ అధికారులు తెలిపారు.
మంగళవారం (అక్టోబర్ 13,2020)ఈ బాంబును నిర్వీర్యం చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. నదిలో పేలటంతో నీరు ఉవ్వెత్తున పైకి ఎగజిమ్మింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తీ నష్టాలు జరగలేదని అధికారులు స్పష్టంచేశారు.
1945 నాటి రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ యుద్ధ నౌక లుట్జోపై బ్రిటన్ రాయల్ వాయుసేన ఈ బాంబును వదిలింది. అప్పటినుంచి ఈ బాంబ్ పోలాండ్ లో నిక్షిప్తమై ఉండి పోయింది. దీనివల్ల ఎప్పటికైన ప్రమాదం జరిగే అవకాశం ఉందనే భావించిన అధికారులు నిర్వీర్యం చేయాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో స్వీనోజ్సై ప్రాంతంలోని పియూస్ట్ కాలువలో నిర్వీర్యం చేయడానికి తీసుకెళ్లారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది దానిని నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలింది. దీన్ని నిర్వీర్యం చేసే సమయంలో నది సమీపంలో నివసించే 750 మందిని అక్కడి నుంచి తరలించారు. ఈ పేలుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.