IPL 2020- RCB vs KKR: కోల్‌కత్తాపై 82పరుగుల తేడాతో గెలిచిన బెంగళూరు

  • Published By: vamsi ,Published On : October 12, 2020 / 11:59 PM IST
IPL 2020- RCB vs KKR: కోల్‌కత్తాపై 82పరుగుల తేడాతో గెలిచిన బెంగళూరు

బెంగళూరు, కోల్‌కత్తా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అధ్భుతంగా రాణించగా.. కోల్‌కత్తా 82పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలయ్యింది. కోల్‌కత్తా బ్యాట్స్‌మెన్లు బెంగళూరు బౌలర్ల దెబ్బకు 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి కేవలం 112 పరుగులు మాత్రమే చెయ్యగలిగారు. సుబ్మాన్ గిల్ మాత్రమే కోల్‌కత్తా బ్యాట్స్‌మెన్లలో 34పరుగులు చేశాడు. ఆండ్రీ రస్సెల్, రాహుల్ త్రిపాఠి చెరో 16పరుగులు చెయ్యగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్లు ఎవరు కూడా డబుల్ డిజిట్ స్కోరు కూడా చెయ్యలేకపోయారు.



అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20ఓవర్లలో 2వికెట్లు నష్టానికి 194పరుగులు చేసింది. డివిలియర్స్ మెరుపులు స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. డివిలియర్స్‌ 33బంతుల్లో 73పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ 28బంతుల్లో 33పరుగులు చేశాడు. దేవదత్ పాడిక్కల్ 23బంతుల్లో 32పరుగులు చెయ్యగా.. ఆరోన్ ఫించ్ 37బంతుల్లో 47పరుగులు చేశాడు. కోల్‌కత్తా జట్టులో ప్రసీద్ కృష్ణ, ఆండ్రీ రస్సెల్ చెరొక వికెట్ తీసుకున్నారు.



అనంతరం 195పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కత్తా.. 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు టామ్ బాంటన్ సుబ్మాన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. 8 పరుగుల స్కోరు చేసిన తర్వాత బాంటన్‌ను నవదీప్ సైనీ బౌల్డ్ చేశాడు. నితీష్ రానాను బెంగళూరు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ పెవిలియన్‌కు పంపించగా.. సెట్ బ్యాట్స్‌మన్ షుబ్మాన్ గిల్ 34 పరుగులకు రనౌట్ అయ్యాడు. ఇసురు ఉడానా త్రో చెయ్యగా.. వికెట్ కీపర్ డివిలియర్స్ చేత రనౌట్ అయ్యాడు.



అనంతరం పంజాబ్‌తో మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ దినేష్ కార్తీక్.. కేవలం 1 పరుగులకే యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తరువాత, ఇయాన్ మోర్గాన్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఇసురు ఉడానాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆండ్రీ రస్సెల్ పెద్ద షాట్లు తీసే క్రమంలో 16 పరుగులు చేసి ఇసురు ఉడానా బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.



ఒక్క పరుగు మాత్రమే చేసి, పాట్ కమ్మిన్స్, క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో అవుట్ అవగా.. ఎనిమిదో వికెట్‌గా రాహుల్ త్రిపాఠి మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత కమలేష్ నాగర్‌కోటి కూడా 7బంతుల్లో 4పరుగులు చేసి మోరికస్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. తర్వాత వరుణ్ చక్రవర్తి 10బంతుల్లో 7పరుగులు, ప్రసీద్ కృష్ణ 3బంతుల్లో 2పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.



బెంగళూరు బౌలర్లలో క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్ చెరో 4ఓవర్లు వేసి తలా 2వికెట్లు తీసుకోగా.. సైనీ, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ఇసురు ఉడానా తలా ఒక్క వికెట్ తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఏబీ డివిలియర్స్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 82పరుగుల విజయం రాయల్ ఛాలెంజర్స్‌కి నెట్‌ రన్‌రేట్‌లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.