ఐపీఎల్ -13 : బెంగళూరుపై ఢిల్లీ విజయం

  • Published By: bheemraj ,Published On : November 3, 2020 / 12:12 AM IST
ఐపీఎల్ -13 : బెంగళూరుపై ఢిల్లీ విజయం

Delhi win over Bangalore : ఐపీఎల్ -13 వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఢిల్లీ గెలిచింది. బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఢిల్లీ 4 వికెట్లు నష్టపోయి 154 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ చేరుకుంది. రేపటి మ్యాచ్ గెలిస్తే హైదరాబాద్ సన్ రైజర్స్ నేరుగా ప్లేఆఫ్ కు చేరుకుంటుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ కు చేరుకుంది.



ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 153 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, ఢిల్లీ 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆరంభంలోనే పృథ్వీ షా(9) వికెట్‌ను కోల్పోయింది. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన రెండో ఓవర్‌ ఐదో బంతికి పృథ్వీ షా బౌల్డ్‌ అయ్యాడు. ఆ తరుణంలో శిఖర్‌ ధావన్‌ 41 బంతుల్లో 54 పరుగులు (6 ఫోర్లు), అజింక్యా రహానే 46 బంతుల్లో 60 పరుగులు (5 ఫోర్లు, 1సిక్స్‌)లు రాణించారు. ఈ జోడీ 88 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసింది.



ఢిల్లీ స్కోరు 107 పరుగుల వద్ద ఉండగా ధావన్‌ పెవిలియన్‌ చేరాడు. షహబాజ్‌ అహ్మద్‌ వేసిన 13 ఓవర్‌ నాల్గో బంతికి ధావన్‌ ఔటయ్యాడు. శ్రేయస్‌ అయ్యర్‌(7) నిరాశపరిచాడు. షహబాజ్‌ వేసిన 17 ఓవర్‌ రెండో బంతికి అయ్యర్‌ ఔటయ్యాడు. కాగా, వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన 18 ఓవర్‌ రెండో బంతికి రివర్స్‌ స్వీప్‌ ఆడిన రహానే పెవిలియన్‌ చేరాడు. చివర్లో పంత్‌ 7 బంతుల్లో ఫోర్‌ సాయంతో 8 పరుగులతో నాటౌట్‌గా ఉండగా, స్టోయినిస్‌ 5 బంతుల్లో 1 సిక్స్‌తో 10 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.



ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. దేవదూత్‌ పడిక్కల్‌ 41 బంతుల్లో 50 పరుగులు ( 5 ఫోర్లు)తో రాణించడంతో పాటు విరాట్‌ కోహ్లి 24 బంతుల్లో 29 పరుగులు (2 ఫోర్లు, 1 సిక్స్‌), డివిలియర్స్‌ 21 బంతుల్లో 35 పరుగులు (1 ఫోర్‌, 2సిక్స్‌లు) ఫర్వాలేదనిపించడంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోరు చేసింది. టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ పీల్డింగ్‌ ఎంచుకోవడంతో ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది.



ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను జోష్‌ ఫిలెప్పి, పడిక్కల్‌లు ఆరంభించారు. జట్టు స్కోరు 25 పరుగుల వద్ద ఉండగా ఫిలెప్పీ(12) పెవిలియన్‌ చేరాడు. రబడా వేసిన ఐదో ఓవర్‌ తొలి బంతికి ఫిలెప్పి ఔటయ్యాడు. అనంతరం ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను పడిక్కల్‌- కోహ్లిలు చక్కదిద్దారు. వికెట్లు కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చిన ఈ జోడి ఆచితూచి ఆడింది.



ఈ జోడి 57 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లి రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ వేసిన 13 ఓవర్‌ మూడో బంతికి భారీ షాట్‌ ఆడిన కోహ్లి.. స్టోయినిస్‌ క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన డివిలియర్స్‌ సమయోచితంగా ఆడాడు. ఈ క్రమంలోనే పడిక్కల్‌తో కలిసి 40 పరుగులు జత చేశాడు.



అయితే నోర్జే వేసిన 16 ఓవర్‌ నాల్గో బంతికి పడిక్కల్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ ఓవర్‌ చివరి బంతికి క్రిస్‌ మోరిస్‌ డకౌట్‌ అయ్యాడు. చివర్లో డివిలియర్స్‌, శివం దూబే 11 బంతుల్లో 17 పరుగులు (2 ఫోర్లు, 1 సిక్స్‌)తో బ్యాట్‌ ఝుళిపించాడు. ఢిల్లీ బౌలర్లలో నోర్జే 3 వికెట్లు సాధించగా, రబడా 2 వికెట్లు తీశాడు. అశ్విన్‌కు వికెట్‌ దక్కింది.