భారీ స్కోరు చేసిన ముంబై.. ఢిల్లీ టార్గెట్ 201

  • Published By: vamsi ,Published On : November 5, 2020 / 09:27 PM IST
భారీ స్కోరు చేసిన ముంబై.. ఢిల్లీ టార్గెట్ 201

ఐపీఎల్‌2020లో ప్లేఆ‍ఫ్స్‌ సమరంలో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌-1లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ముందుగా ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20ఓవర్లలో 200పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ టార్గెట్ 201గా ఫిక్స్ అయ్యింది.



ఈ సీజన్‌లో ఇరు జట్లు తలపడిన రెండు మ్యాచ్‌లలోనూ ముంబై విజయం సాధించగా.. ఈ మ్యాచ్‌లో కూడా ముంబై ఢిల్లీపై బలంగా ఆడుతుంది. స్టార్టింగ్ నుంచే దూకుడుగా ఆడడం మొదలుపెట్టిన ముంబై ఇండియన్స్.. ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ కాగా… మరో ఓపెనర్ క్వింటన్ డి కాక్ 25 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేశాడు. మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ 38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు.



తర్వాత పోలార్డ్ కూడా డకౌట్ అయ్యాడు. వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన దశలో ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా కలిసి బౌండరీల మోత మోగించారు. కృనాల్ పాండ్యా 13 పరుగులు చేసి అవుట్ అవగా.. ఇషాన్ కిషన్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. హార్ధిక్ పాండ్యా 14 బంతుల్లో 5సిక్సర్లతో 37 పరుగులు చేయగా భారీ స్కోరు చేయగలిగింది ముంబై ఇండియన్స్. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీయగా స్టోయినిస్, నార్జేలకి చెరో వికెట్ దక్కింది.