RR vs SRH : సిక్సర్లతో శివతాండవం చేసిన మనీశ్
RR vs SRH Pandey, Shankar help Sunrisers : ఆరంభంలోనే స్టార్ ఓపెనర్లు (వార్నర్, బెయిర్ స్టో) వికెట్లు పోయాయి. తీవ్రమైన ఒత్తిడి దశలో ఉన్న తరుణంలో సన్ రైజర్స్ బ్యాట్ మెన్ మనీశ్ పాండే శివాలెత్తాడు. సిక్సర్లతో విరుచకపడ్డాడు. విజయ్ శంకర్ తో కలిసి పరుగుల వరద పారించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు చేతులెత్తేశారు. ఫలితంగా…8 వికెట్ల తేడాతో హైదరాబాద్ జయభేరి సృష్టించింది.
RR vs SRH :
ఐపీఎల్ 2020 మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఆడే మ్యాచ్ లన్నీ..రాజస్థాన్ గెలిచి తీరాల్సి ఉంటుంది. ముందు బ్యాటింగ్ కు దిగిన రాయల్స్ బ్యాట్స్ మెన్స్ లో ఆ కసి కనిపించలేదు. రాబిన్ ఊతప్ప, స్టోక్స్ ఆటను ఆరంభించారు. జట్టు స్కోర్ 30 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఊతప్ప (19) రనౌట్ అయ్యాడు.
https://10tv.in/virat-kohli-captains-should-have-option-of-reviewing-wide-ball-or-waist-high-full-toss/
రాజస్థాన్ నిర్లక్ష్యం :
అనంతరం వచ్చిన సామ్సన్ ధాటిగా ఆడడం అనిపించింది. స్టోక్స్, సామ్సన్ లు ఇద్దరూ వికెట్ పోకుండా..జాగ్రత్తగా ఆడారు. చాలా సేపు క్రీజులో ఉన్నా..పరుగులు మాత్రం ఆశించినంతగా రాలేదు. 8.1 ఓవర్లు వీరు క్రీజులో ఉంటే..కేవలం బాదింది మూడు బౌండరీలు, ఒక సిక్స్ కావడం విశేషం. కట్టుదిట్టంగా హైదరాబాద్ బౌలర్లు బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టడం వారికి సాధ్యం కాలేదు.
150 పరుగులు :
సామ్సన్ను హోల్డర్, స్టోక్స్ను రషీద్ ఖాన్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చారు. ఆ తర్వాత వచ్చిన బట్లర్ (9), కెప్టెన్ స్మిత్ (19) కూడా బ్యాటింగ్ కు పని చెప్పలేదు. తర్వాత రియాన్ పరాగ్ (12 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్), ఆర్చర్ (7 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కొట్టిన సిక్స్ ఫోర్తో రాయల్స్ 150 పరుగులు దాటగలిగింది. మొత్తంగా 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది.
హైదరాబాద్ షాక్ :
అనంతరం బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ స్టార్టింగ్ లోనే షాక్ తగిలింది. రాయల్స్ పేసర్ ఆర్చర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ఆర్చర్ నాలుగో బంతికి వార్నర్ (4)ను అవుట్ చేశాడు. తన మరుసటి ఓవర్లో (ఇన్నింగ్స్ 3వ) బెయిర్స్టో (10)ను బౌల్డ్ చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో రాజస్తాన్ శిబిరంలో ఆనందం తాండవించింది.
చుక్కలు చూపించిన పాండే :
కానీ ఈ ఆనందం కొద్దిసేపట్లోనే ఆవిరైపోయింది. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన మనీశ్ పాండే..రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కార్తీక్ త్యాగి తొలి ఓవర్లో రెండు బౌండరీలు బాదిన పాండే… స్టోక్స్ వేసిన వరుసటి ఓవర్లో డీప్ స్క్వేర్ లెగ్, మిడ్ వికెట్ల మీదుగా రెండు సిక్సర్లు కొట్టాడు. మరోవైపు విజయ శంకర్ నెమ్మదిగా ఆడుతూ..పాండేకు చక్కటి సహకారం అందించాడు.
సిక్స్ లు ఫోర్లు :
అడపాదడపా బౌండరీలు కొట్టడంతో హైదరాబాద్ స్కోరు పరుగులు పెట్టింది. పాండే బంతి బ్యాట్ కు తగిలితే..చాలు..అది బౌండరీ..లేదా సిక్స్ కావాల్సిందేనట్లుగా ఆడాడు. 5.4 ఓవర్లలో హైదరాబాద్ స్కోరు 50 దాటేసింది. 12.3 ఓవర్లలోనే సన్ 100 పరుగులను చేరుకుంది. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి రాజస్థాన్ బౌలర్లు శ్రమించారు. కానీ వారికి సాధ్యం కాలేదు.
11 బంతులు మిగిలి ఉండగానే :
ఈ తరుణంలో…పాండే హాఫ్ సెంచరీ బాది..సెంచరీ వైపు దూసుకెళ్లాడు. చివరిలో 30 బంతుల్లో 37 పరుగులే చేయాలి. 6వ ఓవర్ వేసిన ఆర్చర్ బౌలింగ్లో శంకర్ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్లో 13 పరుగులు రావడంతో మిగిలిన నాలుగు ఓవర్లలో బంతికో పరుగు చేసేలా మారిపోయింది. మనీశ్ ఓవర్కో సిక్స్ బాదడంతో 11 బంతులు మిగిలుండగానే హైదరాబాద్ గెలిచింది. మనీశ్ పాండే (నాటౌట్) 83; విజయ్ శంకర్ (నాటౌట్) 52 చేశారు. 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం సాధించగా..ఏడో ఒటమితో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ క్లిష్టంగా మారింది.