IPL 2021: పీకల్లోతు కష్టాల్లో పంజాబ్..
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా కోల్కతాతో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ బ్యాట్స్మెన్ మరోసారి పేలవ ప్రదర్శనతో సరిపెట్టుకున్నారు.
IPL 2021: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా కోల్కతాతో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ బ్యాట్స్మెన్ మరోసారి పేలవ ప్రదర్శనతో సరిపెట్టుకున్నారు. అహ్మదాబాద్ స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్తో పంజాబ్ కుప్పకూలింది. కోల్కతా బౌలర్ల దెబ్బకు పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది.
మయాంక్ అగర్వాల్(31: 34 బంతుల్లో 1×4, 2×6) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్(19), క్రిస్గేల్(0), దీపక్ హుడా(1), నికోలస్ పూరన్(19), హెన్రిక్స్(2), షారుక్ ఖాన్(13) నిరాశపరిచారు. కోల్కతా బౌలర్లు అందరూ సమిష్టిగా పంజాబ్ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.
కోల్కతా బౌలింగ్ ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది పంజాబ్. కమిన్స్ వేసిన ఆరో ఓవర్లో కేఎల్ రాహుల్.. మిడాఫ్లో సునీల్ నరైన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పవర్ప్లే ఆఖరికి పంజాబ్ 37/1తో నిలిచింది. శివమ్ మావి వేసిన తర్వాతి ఓవర్లో ఎదుర్కొన్న తొలి బంతికే క్రిస్గేల్ పెవిలియన్ చేరాడు.
ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఎనిమిదో ఓవర్లో ఫామ్లో ఉన్న దీపక్ హుడా మోర్గాన్కు క్యాచ్ ఇచ్చి సరిపెట్టుకున్నాడు. 42/3తో కష్టాల్లో పడిన జట్టును మయాంక్ ఆదుకునే ప్రయత్నం చేసినా జట్టు స్కోరు 60 వద్ద అగర్వాల్ను నరైన్ అవుట్ చేయడంతో పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
మిడిలార్డర్ చేతులెత్తేయడంతో 79 రన్స్కే 6 కీలక వికెట్లు చేజార్చుకుంది. మ్యాచ్పై పట్టుసాధించిన కోల్కతా ఆఖరి వరకు కట్టుదిట్టంగా బంతులేసి పరుగులు రాకుండా కట్టడి చేసింది. పంజాబ్ ఏ దశలోనూ పుంజుకోలేదు. చివరి రెండు ఓవర్లలో క్రిస్ జోర్డాన్ అడపాదడపా బౌండరీలు బాదడంతో జట్టు స్కోరు 120పరుగులను దాటగలిగింది.