Home » ఇండియాకు ఇరాన్ షాక్ : చైనాతో డీల్…చాబహర్ రైల్వే ప్రాజెక్టు నుంచి భారత్ తొలగింపు
Published
7 months agoon
భారత్-చైనాల మధ్య గొడవలు కొనసాగుతున్న సమయంలో ఇరాన్.. భారత్కు అతిపెద్ద షాక్ ఇచ్చింది. ఓ అత్యంత కీలకమైన ప్రాజెక్టు భారత్ చేతి నుంచి చేజారిపోయింది. చైనాతో 400 బిలియన్ డాలర్ల ఒప్పందానికి ముందే ఇరాన్… చాబహర్ రైలు ప్రాజెక్టు నుంచి భారత్ను తప్పించింది. ఈ చాబహర్ రైలు ప్రాజెక్టును భారత ప్రభుత్వ రైల్వే సంస్థ ఇర్కాన్ పూర్తి చేయాల్సి ఉన్నది.
దాదాపు నాలుగేళ్ల క్రితం చాబహార్–జహేదాన్ మధ్య రైలు మార్గం వేయడానికి ఇరాన్ భారత్ మధ్య ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం 3,015 కోట్ల రూపాయల వ్యయంతో 2022 నాటికి భారత్ ఈ మార్గాన్ని నిర్మించాలి. ఆసాంతం అప్ఘానిస్థాన్ బోర్డర్ను ఆనుకుంటూ వెళ్లే 628 కిలోమీటర్ల ఈ రైలు మార్గం అత్యంత కీలకమైనది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి భారతదేశం నుంచి ఇంజనీర్లు కూడా ఇరాన్కు వెళ్లారు. అయితే, అమెరికా ఆంక్షల భయంతో భారత్ రైలు ప్రాజెక్టు పనులను ప్రారంభించలేదు.
అయితే గత నాలుగేండ్ల తరువాత కూడా ఈ ప్రాజెక్టుకు భారతదేశం నిధులు ఇవ్వడం లేనందునే తామే ఈ ప్రాజెక్టును స్వయంగా పూర్తి చేసుకుంటామని ఇరాన్ చెప్తున్నది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా చాలా పెద్దదిగా భావిస్తున్నారు. 628 కిలోమీటర్ల పొడవైన ఈ ట్రాక్ నిర్మాణాన్ని గత వారం ఇరాన్ రవాణా మంత్రి మొహమ్మద్ ఇస్లామి ప్రారంభించారు .భవిష్యత్లో ఈ మార్గాన్ని ఆఫ్ఘనిస్తాన్ లోని జరంజ్ సరిహద్దు వరకు విస్తరిస్తామని ఇరాన్ రవాణా మంత్రి రైలు మార్గ శంకుస్థాపన సందర్భంగా మహమ్మద్ ఇస్లామీ పేర్కొన్నారు.
చైనాతో బిగ్ డీల్
అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం మధ్య.. ఇరాన్ను నియంత్రించడానికి చైనా ప్రయత్నించింది. ఇందులో భాగంగా ఇరాన్ తో చైనా ఒక పెద్ద ఒప్పందం కుదుర్చుకోబోతున్నది. దీని కింద ఇరాన్ నుంచి చమురును చాలా తక్కువ ధరకు చైనా కొనుగోలు చేస్తుంది. బదులుగా ఇరాన్లో 400 బిలియన్ డాలర్లు పెట్టుబడులను చైనా ప్రభుత్వం పెట్టడానికి అంగీకరించింది. అంతే కాకుండా, ఇరాన్కు అత్యాధునిక ఆయుధాలను అందివ్వడంలో కూడా చైనా సహాయపడనున్నది.. చైనా రాకతోనే ఇరాన్, ఇండియాను పక్కనబెట్టిందనే రిపోర్టులూ వస్తున్నాయి
ఇరాన్, చైనా ఒప్పందం కుదిరితే డ్రాగన్ దేశం చాబహార్ పోర్టును ఎలాంటి పన్నులు కట్టకుండా వాడుకోవచ్చు. పోర్టుకు దగ్గర్లోని ఓ ఆయిల్ రిఫైనరీ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన తదితరాలకు చైనా సహకరిస్తుంది. చాబహార్ పోర్టు నిర్మాణంలోనూ చైనా కీలకపాత్ర పోషించనుందని సమాచారం. అంతేకాకుండా ఈ పాతికేళ్లలో చైనాకు ఇరాన్ క్రమం తప్పకుండా ఆయిల్, గ్యాస్ను సరఫరా చేయాలి. చైనా చాబహార్ను అభివృద్ధి చేస్తుందని వస్తున్న రిపోర్టులను ఇరాన్ అధికారులు ఖండించారు.
భారత్ కు పెద్ద నష్టం
చాబహార్ రైల్వే ప్రాజెక్టును కోల్పోవడం భారత్కు దౌత్యపరంగా పెద్ద దెబ్బని కాంగ్రెస్ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దౌత్యం పరంగా ఒక్క పనీ సరిగా చేయలేదని విమర్శించింది. ఇంత చేసిన వాళ్లను ఒక్క ప్రశ్న కూడా అడగకూడదు అంటూ కాంగ్రెస్ నేత అభిషేక్ మనుసింఘ్వీ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.