ఆన్ లైన్ డిగ్రీ కోర్సు ప్రారంభించిన మద్రాస్ IIT

  • Published By: nagamani ,Published On : July 1, 2020 / 03:45 PM IST
ఆన్ లైన్ డిగ్రీ కోర్సు ప్రారంభించిన మద్రాస్ IIT

ఇండియన్ ఇన్ సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఆన్ లైన్ బీఎస్సీ డిగ్రీ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ కోర్సును ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నామని మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ భాస్కర్ రామమూర్తి తెలిపారు. మంగళవారం(జూన్ 30, 2020) నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ కోర్సును కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రారంభించారు. ప్రపంచంలోనే తొలిసారి ఆన్ లైన్ రెగ్యులర్ డిగ్రీ కోర్సులు ఇవి.

ఈ కోర్సులకు ప్రవేశార్హత కేవలం ఇంటర్మీడియెట్‌ పాసైతే చాలు. అంటే ఇంటర్ పాస్ అయితే చాలు ఈ కోర్సులో చేరిపోవచ్చు. అంతేకాదు ఇప్పటికే పలుకోర్సులు చేసి.. ఉద్యోగాలు చేసుకునేవాళ్లు కూడా ఈ కోర్సులను నేర్చుకునే వెలుసుబాటు ఉంది.మూడేళ్లపాటు డిగ్రీ చదివి తీరాలనే నిబంధన కూడా లేదు. కొన్ని నెలలు, కొన్ని అంశాలను చదవుకుంటే సర్టిఫికెట్‌ కోర్సు..తరువాత కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తరువాత మొత్తం సబ్జెక్టులను కలుపుకుని చదువుకుని డిప్లొమా, డిగ్రీ సర్టిఫికెట్లు అందించటం ఈ కోర్సు ప్రత్యేకత.

ఈ కోర్సుల ద్వారా పెద్ద సంఖ్యలో విద్యార్థులను చేరుకోవడమే ఈ సంస్థ లక్ష్యంమని భాస్కర్ రామ్మూర్తి తెలిపారు.ఐటీ పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా రూపొందించిన ఈ కోర్సు విద్యార్థులకు మాత్రమే కాక, వృత్తి నైపుణ్యాలను పెంపొందిస్తూ ఐటీ ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ఈ కోర్సును ఆన్‌లైన్‌ కోర్సును ప్రారంభించిన అనంతరం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌ మాట్లాడుతూ లక్షల మంది ఐఐటీ విద్యార్థులు ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్తున్నారని..భారతదేశపు విద్యార్ధుల మేథస్సును దేశానికే ఉపయోగపడేలా చేయాలనేది ఈ కోర్సుల లక్ష్యమని అన్నారు. ఇటువంటి మేధోవలసకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. ఐఐటీ మద్రాస్‌ సిద్ధంచేసిన బీఎస్సీ ఇన్‌ ప్రోగ్రామింగ్‌/డేటా సైన్సెస్‌ ఇందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.

ఈకోర్సుల్లో ప్రతీసంవత్సరం జనవరి, మే, సెప్టెంబర్‌లో విద్యార్థులను చేర్చుకుంటారు. వారానికి 2 – 3 గంటల వీడియో పాఠాలు, క్విజ్‌లు.. దగ్గరలోని సెంటర్‌ వద్ద పరీక్షలు నిర్వహిస్తారు. క్వాలిఫయర్‌ పరీక్ష సాయంతో కోర్సులోకి ఎవరు చేరవచ్చో నిర్ణయిస్తారు. ఫౌండేషన్‌ సర్టిఫికెట్‌ కోర్సులో లెక్కలు..కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ లెసెన్స్ వంటి ఎనిమిది కోర్సులుంటాయి.

ఈ 8 సబ్జెక్టులను పూర్తిచేసి కోర్సు మానేసేవారికి కూడా ఫౌండేషన్‌ సర్టిఫికెట్‌ లభిస్తుంది. కోర్సులను కొనసాగిస్తే.. ప్రోగ్రామింగ్, డేటా సైన్స్‌లలో డిప్లొమా కూడా చేయవచ్చు. కంపెనీల్లో పనిచేస్తూ స్కిల్క్స్ డెవలప్ చేసుకోవాలనేవారు నేరుగా డిప్లోమా ఈ కోర్సులో చేరవచ్చు. వారానికి పది గంటల చొప్పున ఆన్‌లైన్‌ లెస్సన్స్ ..ఎగ్జామ్స్ లు ఉంటాయి.
సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల్లో తొలి విడత కోర్సులను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసిన వారికి ప్రోగ్రామింగ్, డేటా సైన్స్‌ సబ్జెక్టుల్లో విడివిడిగా డిప్లొమా అందిస్తారు. రెండు సబ్జెక్టుల్లోనూ డిప్లొమా అందుకునే అవకాశం కూడా ఉంది. డిగ్రీ కోర్సు పూర్తి చేయాలనునుకునే వారు కోర్సును కొనసాగించవచ్చు.

చివరగా డిగ్రీ కోర్సు పూర్తికి మూడు నుంచి ఆరేళ్లు పడుతుంది. తొలి రెండు దశలు పూర్తిచేసిన వారు లేదా నేరుగా డిప్లొమా కోర్సులో చేరి పూర్తిచేసిన వారు డిగ్రీ కోర్సు పూర్తి చేసేందుకు అర్హులు. కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్, మెషీన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి పలు ఆప్షన్లలో రెండింటిని ఎంచుకుని కోర్సు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఫౌండేషన్‌ కోర్సుకైతే రూ.32 వేలు, డిప్లొమా కోర్సుకు రూ.1.10 లక్షలు, డిగ్రీ కోర్సుకు రూ.లక్ష ఫీజు. అంటే, ఇంటర్మీడియట్‌ తరువాత బీఎస్సీ ఇన్‌ ప్రోగ్రామింగ్‌/డేటా సైన్సెస్‌ డిగ్రీ కోర్సు పూర్తికి రూ.2.42 లక్షలు ఖర్చవుతాయన్నమాట. ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్దులు వివరాల కోసం వెబ్‌సైట్‌ onlinedegree. iitm. ac. in చూడవచ్చు.

Read:చైనాకు ధీటుగా పవర్‌ఫుల్ ఉక్కు పడవలను లడఖ్‌‌కు పంపుతున్న భారత్