Andhra Pradesh: వయసు వందేళ్లు.. ఇంట్లో ఉండే కరోనాను జయించింది!
కరోనా అనగానే కంగారు పడిపోవడం.. ఉన్న సమస్యకు తోడు ఆందోళన చెంది ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఇప్పుడు ఎక్కువమంది కరోనా పేషేంట్లలో కనిపిస్తుంది. కరోనా సోకిన వారిలో మరణాలు కూడా ఈ భయానికి కారణమే అయినా ఇది కరోనా రోగులలో చాలా తక్కువ శాతమే.
Andhra Pradesh: కరోనా అనగానే కంగారు పడిపోవడం.. ఉన్న సమస్యకు తోడు ఆందోళన చెంది ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఇప్పుడు ఎక్కువమంది కరోనా పేషేంట్లలో కనిపిస్తుంది. కరోనా సోకిన వారిలో మరణాలు కూడా ఈ భయానికి కారణమే అయినా ఇది కరోనా రోగులలో చాలా తక్కువ శాతమే. ఈ సెకండ్ వేవ్ లో యువకులు, మధ్య వయసు వారు కూడా కరోనా బారినపడి మృత్యువాత పడేవారి సంఖ్య ఎక్కువగా ఉండడం మరింత ఆందోళన కలిగిస్తుంది. అయితే, భయం వీడి వైద్యుల సలహాలు, సూచనలతో పాటు మంచి ఆహరం తీసుకుని కరోనాను జయించవచ్చని నిరూపించారు ఓ వందేళ్ల భామ.
ఈ మధ్యనే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 110 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించి ఔరా అనిపించగా ఇప్పుడు ఏపీలో నూరేళ్ళ భామ ఇంట్లోనే ఉండి కరోనాను జయించి శభాష్ అనిపించుకుంది. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని కుమ్మరిగుంట గ్రామానికి చెందిన వందేళ్ల వృద్ధురాలు యాళ్ల సీతారామమ్మ గత నెలలో కరోనా బారిన పడ్డారు. డిప్యూటీ సీఎం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకు ఈమె స్వయాన పెద్దమ్మ కూడా.
వ్యాధి లక్షణాలు కనిపించడంతో ఇంటి వద్దే ఆర్టీ పీసీఆర్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా ఫలితాలొచ్చాయి. అయితే, లక్షణాలు స్వల్పంగానే ఉండడంతో ఇంటి వద్దే వైద్యుల సలహాలు, సూచనలతో ఆమె హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఉదయం తేనె కలిపిన నిమ్మరసం, మాంసాహారంతో భోజనం, బొప్పాయి, పళ్ల రసాలు, పోషకాలు ఎక్కువ ఉండే ఆహారం వంటివి కుటుంబ సభ్యులే అందించి ఆమెని చూసుకున్నారు. ఫలితంగా 25 రోజుల తర్వాత ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా మారిపోయారు.