తండ్రి హత్య…సాక్ష్యాలు మాయం చేయటానికి క్రైమ్ సీరియల్ ను 100 సార్లు చూసిన మైనర్ బాలుడు

  • Published By: murthy ,Published On : October 30, 2020 / 12:33 PM IST
తండ్రి హత్య…సాక్ష్యాలు మాయం చేయటానికి క్రైమ్ సీరియల్ ను 100 సార్లు చూసిన మైనర్ బాలుడు

టీవీ సీరియల్స్ మీద స్మార్ట్  ఫోన్లలో సెటైర్లు తెగ చక్కర్లు కొడుతుంటాయి. వాటి వల్ల చెడు ఎక్కువ జరుగుతోందని సెటైర్లు వేస్తుంటారు. ఒక మైనర్ బాలుడు చేసిన హత్యలో ఆధారాలు కప్పి పుచ్చటానికి టీవీ సీరియల్ ను 100 సార్లు చూసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మధురలో జరిగింది.

ఉత్తర ప్రదేశ్ లోని మధురలో నివసించే మనోజ్ మిశ్రా(42) స్ధానిక ఇస్కాన్ కార్యాలయంలో విరాళాలు సేకరించే పని చేస్తుంటాడు. వివిధ ప్రదేశాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ….. భగవద్గీత ప్రవచనాలు చెపుతూ అక్కడ విరాళాలు సేకరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతను రొజుల తరబడి ఇంటికి దూరంగా గడుపుతూ ఉంటాడు. అతనికి భార్య, 17 ఏళ్ళ ఇంటర్ చదివే కుమారుడు, 11 ఏళ్ల కుమార్తె ఉన్నారు.



సరిగా చదువుకోకుండా… చెడు సహవాసాలు చేస్తున్నాడని ఈ ఏడాది మే2 వ తేదీన తన కుమారుడ్ని మందలించాడు. చెడు తిరుగుళ్లు మాని చదువుపై శ్రధ్దపెట్టమని హితవు చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన మైనర్ బాలుడు సమీపంలోని ఇనుపరాడ్ తీసుకుని తండ్రి తలపై బలంగా కొట్టాడు. కొడుకు కొట్టిన దెబ్బకి విలవిలలాడుతూ మనోజ్ నేలకొరిగాడు. కిందపడి కొట్టు కుంటున్న తండ్రి మెడ చుట్టూ టవల్ బిగించి ఊపిరాడకుండా చేసి కొడుకు హత్య చేశాడు.

అదే రోజు రాత్రి తన తల్లి సంగీతామిశ్రా (39) సాయంతో తండ్రి మృతదేహాన్ని స్కూటీపై, సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆ ప్రాంతమంతా ఆధారాలు దొరక్కుండా టాయిలెట్ క్లీనర్ చల్లాడు. ఆతర్వాత ఏమీ తెలియనట్టు ఇంటికి తిరిగి వచ్చాడు.



మర్నాడు మే3వ తేదీ ఉదయం అటవీ ప్రాంతంలో పాక్షికంగా తగలబడిన మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మూడు వారాలు గడిచినా మృతదేహాన్ని గుర్తించలేక పోయారు. సమీపంలోని ఏ పోలీసు స్టేషన్లోనూ తప్పిపోయిన వ్యక్తుల కేసులు నమోదు కాలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ మర్డర్ కేసు మిస్టరీగా మారింది.

ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు మనోజ్ మిశ్రా కొన్నిరోజులపాటు ఇంటి నుంచి వెళ్తూ ఉండటంతో ఎవరికీ అనుమానం రాలేదు. 3వారాలు దాటిన తర్వాత ఇస్కాన్ సభ్యులు కొంతమంది మనోజ్ మిశ్రా గురించి ఆరా తీశారు. ఈసారి 3 వారాలైనా మనోజ్ కనపడకపోయే సరికి ఆయన గురించి ఆరా తీయటం మొదలెట్టారు. ఇంట్లో విచారించగా….ఎక్కడ ఉన్నారో తెలియదని… ఇంటి నుంచి వెళ్ళి చాలా రోజులైందని చెప్పారు.



కానీ మిశ్రా గురించి క్రమం తప్పకుండా ఆరా తీస్తున్న ఇస్కాన్ సభ్యులు కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. ఇన్నాళ్లు ఇంటికి రాకపోతే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఒత్తిడి చేశారు. వారి ఒత్తిడితో కుటుంబ సభ్యులు మే 27న పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అప్పడు పోలీసులు మనోజ్ కు చెందిన ఆనవాళ్లను వారికి చూపించారు. కొందరు ఇస్కాన్ సభ్యులు మనోజ్ కళ్ళజోడు, శరీరాన్ని గుర్తు పట్టారు. మనోజ్ ఎక్కువు కాలం బయట ఊళ్లలో ప్రచారం నిమిత్తం వెళ్తుండటం వల్ల వెంటనే ఫిర్యాదు చేయలేక పోయినట్లు ఇస్కాన్ సభ్యులు పోలీసులకు చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు మనోజ్ కుటుంబ సభ్యులను విచారించటానికి స్టేషన్ కు రమ్మన్నారు.



పోలీసులు స్టేషన్ కు పిలిచినప్పుడల్లా మనోజ్ కుమారుడు…… తనను ఎందుకు స్టేషన్ కు పిలుస్తున్నారు…. ఏ నిబంధనల ప్రకారం నన్ను ప్రశ్నిస్తున్నారంటూ ఎదురు ప్రశ్నలు వేయసాగాడు. దీంతో పోలీసులకు మిశ్రా కుమారుడి తీరుపై అనుమానం వచ్చింది. అతడి స్మార్ట్ ఫోన్ తీసుకుని పరిశీలించారు. అక్కడే వారికి హత్యకు సంబంధించిన క్లూ లభించింది.

మిశ్రా హత్యకు గురైన తర్వాత అతడి కుమారుడు క్రైమ్ పెట్రోల్ అనే టీవీ సీరియల్ ఎపిసోడ్ ను దాదాపు 100 సార్లు చూసినట్లు గుర్తించారు. ఆ ఎపిసోడ్ లో హత్య చేసిన తర్వాత ఆధారాలను ఎలా మాయం చేయాలనే అంశం ఉంది. మైనర్ బాలుడ్ని పోలీసులు స్టేషన్ కు తీసుకు వెళ్లి తమదైన స్టైల్లో విచారించే సరికి నేరం ఒప్పుకున్నాడు.



తండ్రిని ఎలా హత్య చేశాడు…. తర్వాత ఎలా సాక్ష్యాలు మాయం చేయాలను కున్నాడు….  మొదలైన వన్నీ పోలీసులకు తెలిపాడు. హత్యా నేరం కింద తల్లీ, కొడుకులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనాధలా మారిన 11 ఏళ్ల మిశ్రా కుమార్తెను బంధువులకు అప్పగించారు.