Uttarakhand : ధేలా నదిలోకి దూసుకెళ్లిన కారు..9 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. నైనిటాల్ జిల్లాలోని రాంనగర్ ప్రాంతంలో ఓ కారు ధేలా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది మృతి చెందారు.

Uttarakhand : ధేలా నదిలోకి దూసుకెళ్లిన కారు..9 మంది మృతి

9 Dead As Car Falls Into River In Uttarakhand

Uttarakhand Accident : ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. నైనిటాల్ జిల్లాలోని రాంనగర్ ప్రాంతంలో శుక్రవారం (జులై 8,2022) ఉదయం 5.45 గంటలకు ఓ కారు అదుపు తప్పి ధేలా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌కు చెందిన 10మంది పర్యాటకులు కారులో వెళుతుండగా ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పింది. ఈ క్రమంలో ధేలా నదిలోకి దూసుకెళ్లటంతో 9మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక మహిళలను సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. బాధితులందరూ పంజాబ్‌లోని పాటియాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. మొత్తం ప్రయాణికుల్లో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. మిగతా 9 మందీ చనిపోయారని అధికారులు నిర్ధారించారు. కార్బెట్ జాతీయ పార్కులోని ధేలా జోన్‌లో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.

ఉదయం 5.45 గంటల సమయంలో కారు కార్బెట్ పార్కు వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. వేగంగా దూసుకెళ్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా వెళ్లిపోయారని తెలిపారు. అలా వెళ్లిన కారు ధేలా గ్రామంలోని నదిలో బలమైన ప్రవాహం కారణంగా కొట్టుకుపోయినట్టు వెల్లడించారు. కాగా..ఈ ప్రాంతంలో గతంలోనూ పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. దీంతో నదిపై వంతెన నిర్మించాలన్న చర్చలు జరుగుతున్నాయి. అంతలోనే ఇక్కడ మరో ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.