భర్త జ్ఞాపకాల కోసం 52ఏళ్లు పోరాడి గెలిచిన మహిళ..73 ఏళ్లకు వారసురాలిగా నిలిచింది

భర్త జ్ఞాపకాల కోసం 52ఏళ్లు పోరాడి గెలిచిన మహిళ..73 ఏళ్లకు వారసురాలిగా నిలిచింది

Ahmedabad 73 year widow won after 52 years : ఆడపిల్ల పుట్టటానికి పోరాటం..పుట్టాక పోరాటం. ఇలా అమ్మకడుపులో ఉన్నప్పటినుంచి మొదలైన ఆమె పోరాటం ప్రతీ సందర్భంలోనే చనిపోయేవరకూ కొనసాగుతూనే ఉంటుంది. అటువంటి పోరాటాన్ని ఒకటీ రెండూ ఏళ్లు కాదు ఏకంగా 52 సంవత్సరాల పాటు పోరాడి గెలిచిందో భార్య. తన భర్తకు వారసురాలిగా తన 52 ఏళ్లపోరాటం తరువాత తన భర్త జ్ఞాపకాన్ని దక్కించుకుంది. యాభై రెండేండ్లుగా భర్త ఆస్తి కోసం న్యాయ పోరాటం చేస్తున్న ఆ భార్య గెలిచింది. దాయాదుల మోసాన్ని ఎదిరించి..తన 73 ఏండ్ల వయస్సులో భర్త ఆస్తికి వారసురాలిగా నిలిచింది..! అన్యాయం చేద్దామనుకుంటూ అపరకాళిలా మారి న్యాయాన్ని గెలిపించి తీరుతుందని నిరూపించింది..!!

అహ్మదాబాద్‌ ఖేడా జిల్లాలోని నడియాడ్‌కు చెందిన లీల. 1967లో..తన 20 ఏళ్ల వయస్సులో అరేరా గ్రామానికి చెందిన సంపత్‌సింగ్‌ మహీదా అనే వ్యక్తిని పెండ్లి చేసుకుంది. కానీ..ఆమె కలలు ఏడాదికే కల్లలయ్యాయి. పెళ్లి జరిగిన సంవత్సరానికే భర్త సంపత్ సింగ్ మరణించాడు. దీంతో అత్తింటివాళ్ల సాధింపులు మొదలయ్యాయి. చిన్ననాటే భర్తను పోగొట్టుకున్నా…ఆమె మరో వివాహం చేసుకోవటానికి అత్తింటివారు ఒప్పుకోలేదు. ఆస్తి ఇవ్వటానికి అంగీకరించలేదు.

దీంతో లీల పుట్టిల్లు చేరింది. తన భర్త పేరున ఉన్న భూముల్ని ఆమెకు రాకుండా భర్త అన్నగారైన మహిపాల్‌సింగ్‌ అడ్డంతిరిగాడు. నీకు మా ఆస్తిలో హక్కులేదు పొమ్మన్నాడు. ఫోర్జరీ సంతకాలతో తన భర్త సంపత్ సింగ్ ఆస్తిని తన పేరున రాయించుకున్నాడని ఆలస్యంగా తెలుసుకుంది లీల. దీంతో సంపత్ సింగ్ భార్యగా తనకు కూడా హక్కు ఉందని వాదించింది. తన భర్తకు రావాల్సిన వాటా ఇవ్వమని అడిగింది. కానీ ఫలితం లేదు. దీంతో న్యాయపోరాటానికి దిగింది.

భర్త అన్న మహిపాల్‌సింగ్‌పై కేసు పెట్టింది. కానీ ఒంటరి ఆడది నన్నేం చేస్తుందనుకున్నాడు మహిపాల్‌సింగ్‌. కానీ లీల అతను అనుకున్నంత బేల కాదు. మహిపాల్‌ మోసాన్ని బయట పెట్టేందుకు సాక్ష్యాలు సేకరించే పని మొదలుపెట్టింది. అంతేకాదు..అత్తింటి కుటుంబంలో మహిపాల్‌ అన్నదమ్ముల వరుసగా చనిపోవటం..అన్నదమ్ముల అందరి ఆస్తులు మహిపాల్ పేరుతోనే రిజిస్టర్ కావటాన్ని గుర్తించింది. దీంతో అనేక సందేహాలు కలిగిన లీల ఆదిశగా కూడా సాక్ష్యాలు సేకరించటం మొదలు పెట్టింది.

ఆ ఆస్తుల పూర్తి వివరాలను సేకరించి, కోర్టుకు సమర్పించింది. ఫోర్జరీ వ్యవహారాల గుట్టు రట్టు చేసింది. 2020 డిసెంబర్ 18 న కోర్టు తీర్పునిచ్చింది. మహీపాల్ సింగ్ మోసాలకు పాల్పడినట్లుగా కోర్లు తేల్చింది. మహీపాల్ సింగ్ నుంచి లీలకు రావాల్సిన భూముల్ని స్వాధీనంచేసుకుని లీలకు అప్పగించాలని కోర్లు తీర్పునిచ్చింది. భూములకు సంబంధించి కేసులు సివిల్ కిందకు వస్తాయి కాబట్టి ఈ కేసులు ఏకంగా 52 సంవత్సరాల పాటు కొనసాగి..ఎట్టకేలకూ అంతిమంగా లీల కేసూ గెలిచింది.

ఇదంతా జరగడానికి 52ఏళ్ల సుదీర్ఘ కాలం పట్టింది. 20ఏళ్ల వయస్సులో భర్తను కోల్పోయి తన 52 ఏళ్లు న్యాయం పోరాటం చేసిన ఆమె వయస్సంతా పోరాటాలతోనే సరిపోయింది.ఈ పోరాటంలో తన భర్త అన్న మహిపాల్ సింగ్ లీలను ఎన్నో సార్లు బెదిరించాడు. కేసులు విత్ డ్రా చేసుకోమని బెదిరించాడు. డబ్బులు ఆశపెట్టాడు. కానీ దేనికి లీల లొంగలేదు. బెదరలేదు. పోరాడింది..పోరాడింది. ఆఖరికి తన 72ఏళ్ల వయస్సులో కేసులు నెగ్గింది.

ఈ సందర్భంగా లీల మాట్లాడుతూ..వివాహం అయిన తరువాత నా భర్త చనిపోయిన నాటినుంచి నా జీవితం అంతా పోరాటానికే సరిపోయింది. నేను పోరాడింది కేవలం ఆస్తి కోసం కాదు..న్యాయం కోసం…నా భర్త జ్ఞాపకమైన పొలం కోసం..ఈ పోరాటంతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. కానీ పోరాటాన్ని మాత్రం మానలేదు. ఒక్కో సందర్భంలో నా భర్త జ్ఞాపకమైన పొలాన్ని కూడా కోల్పోతానేమో అని భయపడ్డాను. కానీ ‘నేను గెలిచాను. న్యాయం గెలిచింది. నా పక్షాన నిలిచింది’ అని సంతోషంగా..సగర్వంగా చెబుతోంది లీలగా మొదలైన లీల బామ్మ