కరోనా రోగి మృతి, ప్రైవేట్ ఆసుపత్రికి రూ.77లక్షలు జరిమానా

కరోనా రోగి మృతి, ప్రైవేట్ ఆసుపత్రికి రూ.77లక్షలు జరిమానా

నిర్లక్ష్య ధోరణితో కరోనా రోగి మృతికి కారణమైన ప్రైవేట్ ఆసుపత్రిపై అధికారులు కొరడా ఝళిపించారు. కఠిన చర్యలు తీసుకున్నారు. ఏకంగా ఆ ఆసుపత్రికి రూ.77లక్షలు జరిమానా విధించారు. అంతేకాదు ఆ ఆసుపత్రిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగింది. 73 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడ్డాడు. అహ్మదాబాద్ లోని రాజస్తాన్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లారు. అయితే వారు చేసిన ఆలస్యం, నిర్లక్ష్యం కారణంగా వృద్ధుడు జూన్ 18న చనిపోయాడు. దీన్ని సీరియస్ గా తీసుకున్న అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆసుపత్రికి భారీగా జరిమానా విధించడంతో పాటు షో కాజ్ నోటీసులు కూడా జారీ చేశారు.

77లక్షలు కరోనా రోగుల చికిత్సకు ఉపయోగిస్తాం:
”రాజస్తాన్ ప్రైవేట్ హాస్పిటల్ కి రూ.77లక్షలు ఫైన్ విధించాము. అందులో 25లక్షలు రాజస్తాన్ హాస్పిటల్ యాజమాన్యం చెల్లించాలి. ఆసుపత్రిలోని ఎనిమిది మంది బోర్డు మెంబర్లుకు చెరో 2 లక్షలు ఫైన్ వేశాము. 18 మంది ట్రస్టీలు కలిసి 36 లక్షలు చెల్లించాలి. ఈ మొత్తాన్ని కరోనా రోగుల చికిత్స కోసం వినియోగిస్తాము” అని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. దీనిపై పోలీసులు స్పందించారు. అధికారుల ఫిర్యాదుతో రాజస్తాన్ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశామన్నారు. నిర్లక్ష్యం, నేరపూరితమైన కుట్ర అభియోగాలతో ఐపీసీ సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశామన్నారు.

అసలేం జరిగిందంటే:
అహ్మదాబాద్ కి చెందిన 73 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడ్డాడు. దీంతో అధికారులు ఆయనను స్థానిక క్వారంటైన్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధుడికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. వెంటిలేటర్ అవసరం కలిగింది. దీంతో వెంటనే ఆయనను రాజస్తాన్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆసుపత్రి గేటు తియ్యడానికి వారికి 20 నిమిషాలు పట్టింది. ఆ 20 నిమిషాలూ ఆ వృద్ధుడిని గేటు బయటే ఉంచారు. సమయానికి ఆక్సిజన్ అందకపోవడంతో వృద్ధుడి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అక్కడే ఆయన చనిపోయాడు. దీనిపై బంధువుల కోర్టుని ఆశ్రయించారు. దీనిపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది చాలా బాధాకరం అని కోర్టు అంది. వృద్ధుడి మరణానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది.

తగిన శాస్తి జరిగింది:
కోర్టు ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు రాజస్తాన్ ఆసుపత్రిపై కొరడా ఝలిపించారు. నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదు అంటూ ఏకంగా రూ.77లక్షలు జరిమానా విధించారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంచి పని చేశారని అధికారులను ప్రశంసించారు. ఇలా కఠినాతి కఠిన చర్యలు తీసుకుంటే కానీ ప్రైవేట్ ఆసుపత్రులు బాగుపడవని, దారిలోకి రావని, నిర్లక్ష్యాన్ని వీడవని నెటిజన్లు అంటున్నారు. అధికారుల చర్యని వారు స్వాగతించారు.