ఒడిశాలో మరో ఏనుగు మృతి
ఓ వైపు భారతదేశంలో కరోనా విజృంభిస్తుంటే..ఇతర విషాదకర ఘటనలు జరుగుతున్నాయి. ప్రధానంగా మూగ జీవాలు అనుమానాస్పదరీతిలో చనిపోతుండడం ఆందోళన వ్యక్తమౌతోంది. ఇటీవలే కేరళ రాష్ట్రంలో బాంబులు ఉంచిన పండును తిని..దారుణంగా చనిపోయిన ఘటన అందర్నీ కలిచివేసింది.
తాజగా ఒడిశాలోని అడవుల్లో 2020, జూన్ 17వ తేదీ బుధవారం ఉదయం మూడేళ్ల వయస్సున మగ ఏనుగు విగతజీవిగా కనిపించడంతో కలకలం రేపింది. బౌధ్ జిల్లా..మాదాపూర్ అటవీ పరిధిలోని ముండేస్వర ఫారెస్ట్ ఏరియాలోకి దకపదర్ గ్రామానికి చెందిన మహిళలు పుట్ట గొడుగులు సేకరించేందుకు వచ్చారు. అడవిలో ఏనుగు చనిపోయి ఉండడాన్ని వీరు గమనించారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహం కుళ్లిపోవడంతో..రెండు..మూడు రోజుల క్రితమే చనిపోయి ఉండవచ్చునని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.
గత కొద్ది రోజులుగా మూడు ఏనుగులు చనిపోయిన సంగతి తెలిసిందే. అడవి పందులను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన..లైవ్ వైర్ ను తాకి మగ, ఆడ, చిన్న ఏనుగు చనిపోయాయి. జూన్ 14వ తేదీన కియోంఝర్ జిల్లాలో వీటి కళేబరాలను కనుగొన్నారు. మగ ఏనుగు యొక్క దంతాలు కనిపించలేదు. ఈ ఘటనపై అటవీ అధికారులు విచారణ అనంతరం కియోఝర్ ఫారెస్టు ఆఫీసర్, ఫారెస్ట్ గార్డును సస్పెండ్ చేశారు.
జూన్ 12వ తేదీన సుందర్ గడ్ జిల్లాలో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి..ఒక ఏనుగు దుర్మరణం చెందింది. 2019 నుంచి ఏనుగులు 50 శాతానికి పైగా అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నాయని వన్యప్రాణి సంరక్షణ వాదులు వెల్లడిస్తున్నారు. దీనివల్ల ఏనుగుల మరణాల సంఖ్య అధికంగా పెరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.