ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు, ఇప్పుడిలా మోపెడ్ పై.. వైరల్ గా మారిన లీడర్ ఫొటో

ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు, ఇప్పుడిలా మోపెడ్ పై.. వైరల్ గా మారిన లీడర్ ఫొటో

ap ex minister raghuveera reddy photo viral: పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్ సందర్భంగా ఆసక్తికర దృశ్యం కనిపించింది. మాజీ మంత్రి, ఏపీ పీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి ఆహర్యం చర్చకు దారితీసింది. ఓ సాధారణ వ్యక్తిలా, మోపెడ్ పై ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అది కూడా పక్కా రాయలసీమ స్టయిల్లో పంచెకట్టు, చొక్కా, పైన తువాలు, పూర్తిగా నెరిసిన గడ్డంతో కనిపించారు. మోపెడ్ పై తన భార్య సునీతను కూడా తీసుకొచ్చారు. అనంతపురం జిల్లా గంగులవానిపాలెంలో రఘువీరారెడ్డి, సునీత దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రఘువీరారెడ్డిని ఓ సాధారణ మోపెడ్ పై, సాధారణ వ్యక్తిలా చూసి అంతా విస్తుపోతున్నారు.

రఘువీరా తన లైఫ్ స్టైల్ ని పూర్తిగా మార్చేసుకున్నారని అర్థమవుతుంది. పూర్తిగా నెరిసిన గెడ్డంతో.. పక్కా రాయలసీమ స్టైల్‌లో ఎవరూ గుర్తుపట్టలేని విధంగా మారిపోయారాయన. నిన్నమొన్నటి వరకు రాజకీయాలను శాసించిన వ్యక్తేనా అనిపించేలా రఘువీరా కనిపించారు. రఘువీరారెడ్డి కొత్త లుక్.. సాధారణ ప్రజలనే కాదు రాజకీయ నాయకులను సైతం విస్మయానికి గురి చేసింది.

పదేళ్ల ముందు రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా రఘువీరారెడ్డి గుర్తింపు పొందారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. జిల్లాలో ఒకప్పుడు ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఏడాది క్రితం వరకు కూడా ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనుచరులు ఉన్న నాయకుడు ఆయన. కాస్ట్లీ కార్లు, ఖరీదైన డ్రెస్సులు, ముందూ వెనుక సెక్యూరిటీ, మందీ మార్బలం.. ఒకప్పుడు రఘువీరారెడ్డి అనుభవించిన జీవితం.

అలాంటి నేత ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమయ్యారో లేక భవిష్యత్ లేదని నిర్ణయించుకున్నారో కానీ లూప్ లైప్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఓ సాధారణ రైతులా ఆయన తన జీవితాన్ని గడుపుతున్నారు. పొలంలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.