Kerala Governor : రాజ్ భవన్ లో కేరళ గవర్నర్ నిరాహార దీక్ష

కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బుధవారం రాజ్‌భవన్‌లో ఒక రోజు నిరహార దీక్షకు దిగారు.

Kerala Governor : రాజ్ భవన్ లో కేరళ గవర్నర్ నిరాహార దీక్ష

Governor

Kerala Governor కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బుధవారం రాజ్‌భవన్‌లో ఒక రోజు నిరహార దీక్షకు దిగారు. వరకట్న దురాచారాన్ని వ్యతిరేకిస్తూ తిరువనంతపరంలోని తన కార్యాలయంలో ఈ నిరసన దీక్షకు కూర్చున్నారు. పెండ్లిలో కట్నకానుకలు ఇవ్వడం, తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాంధీ భవన్​లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గాంధీ స్మారక నిధి ట్రస్ట్, పలు ప్రజా సంఘాలు నిరాహార దీక్ష చేపట్టాయి. వారికి సంఘీభావంగా గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కూడా రాజ్‌భవన్‌లో దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం 6 గంటలకు నిరాహార దీక్ష విరమించిన గవర్నర్..గాంధీ భవన్‌కు వెళ్లి వరకట్నానికి వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన ప్రజా సంఘాలను మద్దతు తెలిపారు. అక్కడున్న మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కేరళలో ఇటీవల వరుస వరకట్న వేధింపుల మరణాలు నమోదయ్యాయి. అక్షరాస్యతో ముందున్న మన రాష్ట్రానికి ఇది సిగ్గుచేటు. వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం నేరం. అలా చేస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. మన రాష్ట్రాభివృద్ధిలో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి మహిళల గౌరవానికి వరకట్నం భంగం కలిగిస్తుంది. ఏ యువకుడైనా తన పెళ్లికి కట్నం డిమాండ్ చేస్తే అతడు చదువును, దేశాన్ని అవమానించినట్లేనని గాంధీజీ చెప్పారు. ఎవరూ కట్నం తీసుకోబోమని యువత ప్రతిజ్ఞ చేయాలి. వరకట్న వేధింపులకు ముగింపు పలకాలి అని మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ పేర్కొన్నారు.

వరకట్నానికి వ్యతిరేకంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కేరళ గవర్నర్ అభిప్రాయపడ్డారు. మహిళల గౌరవానికి సంబంధించి కేరళ ప్రభుత్వం చేపట్టిన స్త్రీపక్ష కేరళం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు. కాగా, గత నెలలో ఓ మెడికల్ విద్యార్థిని తన భర్త వరకట్న వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రమైన కేరళలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో వరకట్నానికి వ్యతిరేకంగా పలు ప్రజా సంఘాలు, ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను చేపట్టాయి.