PV Sindhu: పీవీ సింధుకు క్షమాపణలు చెప్పిన మ్యాచ్ రిఫరీ
ఇటీవల ముగిసిన ఆసియా ఛాంపియన్షిప్ టోర్నీలో భారత షట్లర్ పీవీ సింధు ఓటమికి ముమ్మాటికి కారణం మ్యాచ్ రిఫరీనేనని తేలింది. ఈ ఘటనపై స్పందించిన బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ ఛైర్మన్ చిహ్ షెన్ చెన్.. తప్పిదానికి క్షమాపణలు కోరారు.
PV Sindhu: ఇటీవల ముగిసిన ఆసియా ఛాంపియన్షిప్ టోర్నీలో భారత షట్లర్ పీవీ సింధు ఓటమికి ముమ్మాటికి కారణం మ్యాచ్ రిఫరీనేనని తేలింది. ఈ ఘటనపై స్పందించిన బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ ఛైర్మన్ చిహ్ షెన్ చెన్.. తప్పిదానికి క్షమాపణలు కోరారు. భవిష్యత్లో ఇటువంటి పొరబాట్లు జరగనివ్వమని హామీ ఇచ్చారు.
ఈ మేరకు పీవీ సింధుకు కమిటీ ఛైర్మన్ రాసిన లేఖలో.. “ఆసియా ఛాంపియన్షిప్లో మీక కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియజేస్తున్నాం. దురదృష్టవశాత్తు పొరబాటును సరిదిద్దుకునే అవకాశం లేదు. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటాం. ఆటలో ఇదంతా ఓ భాగమేనని అంగీకరిస్తారని విశ్వసిస్తున్నా” అని పేర్కొన్నారు.
పొరబాటు జరిగిందెక్కడ:
ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఆసియా చాంపియన్షిప్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ అకానె యమగూచి చేతిలో సింధు ఓటమిపాలై కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న తప్పుడు నిర్ణయమే ఆ ఓటమికి కారణమని సింధు ఫెడరేషన్ కు కంప్లైంట్ చేయడంతో విషయం బయటపడింది.
Read Also : పీవీ సింధు ఓటమి… అయినా పతకం
తొలి గేమ్ సొంతం చేసుకున్న సింధు రెండో గేమ్ 14-11తో ఆధిపత్యంలో దూసుకుపోతుండగా.. మ్యాచ్ రిఫరీ యమగూచికి పాయింట్ కేటాయించాడు. సింధూ సర్వీస్ చేసే సమయంలో ఎక్కువ టైం పట్టిందనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అనంతరం స్కోర్ 14-12గా మారడంతో సింధూ రిఫరీని అడిగింది. యమగూచి సిద్ధంగా లేనందునే తాను సమయం తీసుకున్నానని వివరించే ప్రయత్నం చేసింది.
రిఫరీ వినిపించుకోకుండా యమగూచికి పాయింట్ కేటాయించాడు. అలా మ్యాచ్పై పట్టుసాధించిన యమగూచి చివరకు 19-21 తేడాతో రెండో గేమ్ సొంతం చేసుకుంది. మూడో గేమ్ కూడా 16-21 తేడాతో చేజారడంతో సింధూ ఓటమిపాలైంది.