Bhagwant Mann: గన్ లైసెన్స్లపై పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. కొత్త గన్ లైసెన్సుల జారీ రద్దు.. పాతవాటిపై రివ్యూ
పంజాబ్లో గన్ వయొలెన్స్ ఎక్కువగా పెరిగిపోతోంది. దీనిపై భగవంత్ మన్ ఆధ్వర్యంలోని ఆప్ సర్కారు దృష్టిపెట్టింది. రాష్ట్రంలోని లైసెన్స్డ్ గన్లపై రివ్యూ చేస్తారు.
Bhagwant Mann: రాష్ట్రంలో గన్లతో హింస పెరిగిపోతుండటంపై పంజాబ్ సర్కార్ అప్రమత్తమైంది. గన్ లైసెన్స్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని భగవంత్ మన్ ఆధ్వర్యంలోని ఆప్ సర్కారు నిర్ణయించింది. దీని ప్రకారం.. ఇప్పటికే జారీ చేసిన లైసెన్సుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు.
మూడు నెలలపాటు పాత లైసెన్స్లను రివ్యూ చేస్తారు. అవసరమైన వారికి మాత్రమే లైసెన్స్ మంజూరు చేస్తారు. కొత్త లైసెన్స్ల జారీని రద్దు చేశారు. జిల్లా అధికారులు సూచించినప్పుడు మాత్రమే లైసెన్స్లు మంజూరు చేస్తారు. కొన్ని నెలలుగా రాష్ట్రంలో గన్ వయొలెన్స్ కల్చర్ బాగా పెరిగిపోతోంది. గన్స్తో కాల్పులు జరుగుతున్న ఘటనలు ఎక్కువయ్యాయి. చాలా మంది లైసెన్స్డ్ తుపాకులతో కాల్పులు జరుపుతున్నారు. బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొందరు వాటిని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. నిజానికి వాటిని ఆత్మ రక్షణ కోసమే వాడాలి. కానీ, ఈ విషయంలో చాలా మంది నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీంతో హింస పెరిగిపోతోంది. ఈ పరిస్థితిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గన్ కల్చర్పై ప్రభుత్వం దృష్టిపెట్టింది.
వీటి వాడకంపై పలు నిబంధనలు విధించింది. తాజా నిబంధనల ప్రకారం.. లైసెన్స్లు రివ్యూ చేసి, అనుమతిస్తారు. అలాగే గన్లు బహిరంగంగా ప్రదర్శించడం నిషేధం. వేడుకల్లో గాలిలోకి కాల్పులు జరపడం కూడా నిషేధమే. అలాగే అధికారులు ర్యాండమ్గా తనిఖీలు నిర్వహిస్తారు. మరోవైపు హింస పెరగకుండా కూడా పలు చర్యలు తీసుకోబోతుంది. హింసను ప్రేరేపించే పాటలు, ప్రకటనలపై నిషేధం విధించబోతున్నారు. అలాగే మతాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిన వారిపై చర్యలు తీసుకుంటారు. గత మే నెలలో సింగర్ సిద్ధూ మూసేవాలాతోపాటు, ఇటీవలి డేరా సచ్చా సౌదాకు చెందిన ప్రదీప్ సింగ్ హత్యలో గన్లు వాడిన సంగతి తెలిసిందే.