మిస్టర్ కూల్ సీఎం నితీశ్ కోపం, మీడియాపై ఆగ్రహం

మిస్టర్ కూల్ సీఎం నితీశ్ కోపం, మీడియాపై ఆగ్రహం

Bihar CM Nitish Kumar : కూల్ గా ఉండే సీఎం నితీశ్ కుమార్ కు కోపం వచ్చింది. ఒక్కసారిగా తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. సహనం కోల్పోయి మీడియాపై చిందులేశారు. దీనికంతటికీ కారణం..ఓ జాతీయ ఛానెల్ కు చెందిన రిపోర్టర్ అడిగిన ప్రశ్నే. 2021, జనవరి 15వ తేదీ శుక్రవారం విలేకరులతో సీఎం నితీశ్ కుమార్ మాట్లాడారు. ఇండిగో ఎయిర్ లైన్స్ మేనేజర్ రూపేశ్ కుమార్ సింగ్ హత్య విషయంలో ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీంతో నితీశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే పోలీసులతో పంచుకోవాలని, నేరాన్ని రుజువు చేయడంలో వారికి సహాయపడాలంటూ సూచించారు.

సరిగ్గా పని చేయకపోతే..పోలీసులపై విచారణ చేయడం జరుగుతుందన్నారు. ముందు ఎలాంటి పాలన ఉందో తెలుసుకోవాలని మీడియాను ప్రశ్నిస్తున్నట్లు, హింస చెలరేగిందన్నారు. 2005 కంటే ముందు..ఎలాంటి పాలన ఉందో గ్రహించాలని, ప్రస్తుతం ఆ పరిస్థితి అలా లేదన్నారు. ఎక్కడైనా హత్య చేసిన తర్వాత..దర్యాప్తు, విచారణ జరుగుతోందని, చట్టం ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి చూడాలని హితవు పలికారు. ఎవరికి మద్దతు పలుకుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 సంవత్సరాల భార్యా, భర్తల పాలనలో ఎన్నో నేరాలు జరిగాయని ఆరోపించిన సీఎం నితీశ్..ఎందుకు హైలెట్ చేయలేదని మీడియాను ఉద్దేశించి ప్రశ్నించారు.

మీడియాను తగిన గౌరవం ఇస్తామని చివరిలో వెల్లడించారాయన. ఎయిర్ లైన్స్ మేనేజర్ రూపేశ్ కుమార్ హత్య సీఎం నితీశ్ నివాసానికి సమీపంలో జరగడం సంచలనం రేకేత్తించింది. ఇటీవలే రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ సీఎం నితీశ్ పలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. నితీశ్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని, రోజుకు 100 నుంచి 150 శవాలను లెక్కబెట్టకుండా నితీశ్ నిద్రపోరంటూ…ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.