చెలరేగుతున్న బర్డ్ ఫ్లూ.. 10రాష్ట్రాలకు వ్యాప్తి చెందినట్లు కన్ఫామ్ చేసిన కేంద్రం
Bird Flu: కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ 10 రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్లు కన్ఫామ్ చేసింది. గతంలో బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చిన రాష్ట్రాల్లో కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్లు ఉండగా.. తాజాగా సోమవారం ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలోనూ ఈ వ్యాధిని గుర్తించారు.
రాజస్తాన్లోని టోంక్, కరౌలి, భిల్వారా, గుజరాత్లోని వల్సాద్, వడోదరా, సూరత్ జిల్లాల్లో కాకులు, వలస పక్షలు, అడవి పక్షులు చనిపోవడానికి కారణం బర్డ్ ఫ్లూయేనని కేంద్రం నిర్ధారించింది. ఉత్తరాఖండ్లోని కోట్ద్వార్, డెహ్రాడూన్ జిల్లాల్లో కూడా కాకులు మరణించాయి. తూర్పు ఢిల్లీలోని సంజయ్ లేక్ ప్రాంతాల్లోనూ కాకులు, బాతుల మరణానికి బర్డ్ఫ్లూ కారణమని తేల్చింది.
మహారాష్ట్రలోని పర్భనీ జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు కన్ఫామ్ చేశారు. ముంబై, థానె, దపోలి, బీడ్ ప్రాంతాల్లోనూ బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. ఈ సమయంలో బర్డ్ ఫ్లూపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడాన్ని అడ్డుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. నీటి వనరులు, పక్షుల మార్కెట్లు, జంతు ప్రదర్శనశాలలు, పౌల్ట్రీ ఫామ్ల చుట్టూ నిఘా పెంచాలని, మరణించిన పక్షులను పారవేయడంలో సరైన జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.
బర్డ్ఫ్లూ కేసులు ఉన్నప్పటికీ పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయంపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని, మార్కెట్లను మూసేయొద్దని కేంద్ర పశు సంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సోమవారం అన్ని రాష్ట్రాలకు సూచించారు. బర్డ్ఫ్లూ వ్యాధి పక్షులు, పశువుల నుంచి మనుషుల వరకూ సోకుతుందనడానికి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్లు లేవని చెబుతున్నారు.