‘మాస్కులు పెట్టుకోం’ అంటున్న ముంబై వాసులు..ఒక్క రోజులో రూ. 48 లక్షల జరిమానా వసూలు

‘మాస్కులు పెట్టుకోం’ అంటున్న ముంబై వాసులు..ఒక్క రోజులో రూ. 48 లక్షల జరిమానా వసూలు

Bmc Fine Rs 48 Lakhs For Not Wearing Mask

BMC fine Rs 48 lakhs for not wearing mask : కరోనా..కరోనా..కరోనా. ఎక్కడ విన్నా అదే మాట. మాస్కులు..మాస్కులు పెట్టుకోండీ బాబూలూ అంటూ ప్రభుత్వాలు..అధికారుల గగ్గోలు. మాస్కులు పెట్టుకుని శానిటైజన్ రాసుకుని విసిగిపోయాం..ఈసారికరోనా వచ్చినా దాని అమ్మలాంటి వైరస్ లు వచ్చినా మాస్కులు పెట్టుకోం..అంటూ తెగేసి చెప్పేస్తున్నారు జనాలు. ముఖ్యంగా ముంబై వాసులు మాస్కులు పెట్టుకోం అంటున్నారు. మహారాష్ట్రంలో ముంబైలో రెండోసారి కరోనా ప్రతాపం చూపిస్తున్న క్రమంలో మాస్కులు పెట్టుకోకుండా బైటకు రావద్దని బీఎంసీ అధికారులు మొత్తుకుంటున్నారు.

కానీ కరోనా వైరస్ మళ్లీ చెలరేగిపోతున్నా ప్రజలు మాత్రం మాస్కులు పెట్టుకోవటానికి ఆసక్తి చూపించటంలేదు. మాస్కులు పెట్టుకోవటంలో నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. కనీస జాగ్రత్తలు పాటించకుండా రోడ్లపైకి వస్తున్నారు. అసలే ముంబై. జనాలకేమీ తక్కువలేదు. ఈక్రమంలో పెరుగుతున్న కేసులతో మళ్లీ లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్న ముంబైలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో కొరడా ఝళిపించిన బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) మాస్కులు ధరించకుండా రోడ్లపై తిరుగుతున్న వారి నుంచి జరిమానాలు వసూలు చేస్తోంది.

దీంట్లో భాగంగా..గురువారం (మార్చి11,2021) ఉదయం నుంచి సాయంత్రం వరకు చేపట్టిన తనిఖీల్లో మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వచ్చిన 24,226 మంది నుంచి ఏకంగా రూ.48.45 లక్షలు జరిమానా రూపంలో వసూలు చేసింది. కాగా..2020లో ఏప్రిల్ 20 నుంచి ఇప్పటి వరకు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న 18,45,777 మంది నుంచి రూ. 37,27,45,600 వసూలు చేసినట్టు బీఎంసీ తెలిపింది.