పోస్కో‌‌తో 2019లోనే ఒప్పందం.. జగన్‌ను కూడా కలిశారు: కేంద్రం క్లారిటీ

పోస్కో‌‌తో 2019లోనే ఒప్పందం.. జగన్‌ను కూడా కలిశారు: కేంద్రం క్లారిటీ

విశాఖ స్టీల్ ప్లాంట్‌ విషయంలో రాజకీయంగా హీట్ పెరిగిన సమయంలో.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై రాజ్యసభ సాక్షిగా కేంద్ర ఉక్కుశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక విషయాలను వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు రాజ్యసభ సాక్షిగా స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. పోస్కో ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్‌తో 2019 అక్టోబర్‌లోనే ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. ఒప్పందం తర్వాత సీఎం జగన్‌ను పోస్కో ప్రతినిధులు కలిశారని చెప్పారు.

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిలెడ్(ఆర్ఐఎన్ఎల్)గా వ్యవహరించే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కు 2019లోనే ఒప్పందం కుదిరిందని, ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కూడా ఈ విషయం గురించి తెలుసు అన్నట్లు అర్థం వచ్చేలా లోతైన క్లారిటీ ఇచ్చారు ధర్మేంద్ర ప్రధాన్. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికే దక్షిణ కొరియాకు చెందిన పోస్కో సంస్థ మూడు సార్లు పోస్కో బృందం సందర్శించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

పోస్కో, ఆర్‌ఐఎన్‌ఎల్‌ మధ్య భూముల అప్పగింతకు ఒప్పందం కుదరగా.. పోస్కో ప్లాంట్ ఏర్పాటుకు జాయింట్ వర్కింగ్‌ గ్రూప్‌ను.. ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త ప్లాంట్‌లో పోస్కో వాటా 50 శాతంగా ఉంటుందని, ఆర్‌ఐఎన్‌ఎల్‌ వాటా ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదని సమాధానం ఇచ్చారు. పోస్కో, ఆర్‌ఐఎన్‌ఎల్‌ మధ్య భూముల అప్పగింత ఒప్పందం తర్వాత.. పోస్కో ప్రతినిధులు ఏపీ సీఎం జగన్‌ను కలిశారని చెప్పారు కేంద్ర మంత్రి ప్రధాన్.